కాగ్నిజెంట్‌ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు

19 Feb, 2021 08:51 IST|Sakshi

ఐటీ  సంస్థ కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్ల నియామకాలు

ఈ ఏడాది 35 శాతం పుంజుకోనున్న నియామకలు 

సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ కన్సల్టింగ్‌ రంగంలో ఉన్న యూఎస్‌ సంస్థ కాగ్నిజెంట్‌ ఈ ఏడాది భారత్‌లో 23,000 పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకోనుంది.  2020 ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం పైగా ఎక్కువ అని సంస్థ సీఎండీ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్తగ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు

అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని నంబియార్‌ చెప్పారు. గతేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా 17 వేల ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను సంస్థలో చేర్చుకున్నట్టు వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్‌ ఒకటిగా ఉంటుందని అన్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చిలో పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయని వివరించారు. 18 నెలల్లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్‌ నైపుణ్యాలను కల్పించామన్నారు. కాగ్నిజెంట్‌లో గతేడాది 5,000 మంది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. 2020లో 10,000 మందికి అవకాశం కల్పిస్తారు.     కాగ్నిజెంట్‌కు ఇప్పటికే భారత్‌లో సంస్థకు 2.04 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు