ఐటీ అనుమతి అవసరంలేదు..ఎన్‌డీటీవీ వాటాపై అదానీ గ్రూప్‌!

5 Sep, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో వాటా కొనుగోలుకి ఆదాయపన్ను(ఐటీ) శాఖ అనుమతి అక్కర్లేదని భావిస్తున్నట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటా కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని తెలియజేసింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌కు దశాబ్దంక్రితం వీసీపీఎల్‌ రూ. 403 కోట్ల రుణాలిచ్చింది.

తదుపరి వీసీపీఎల్‌ను అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. ఆర్‌ఆర్‌పీఆర్‌కు అందించిన రుణాలకుగాను ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకోగల వారంట్లను వీసీపీఎల్‌ పొందింది. ఇటీవల ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్నట్లు వెల్లడించింది. తద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌లో 99.5 శాతం వాటాను వీపీసీఎల్‌ పొందనుంది. 

వెరసి ఎన్‌డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. అయితే ఇందుకు ఐటీ అధికారుల అనుమతి అవసరమంటూ ఎన్‌డీటీవీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే.  

చదవండి👉 అదానీకే ‘లంక’ ప్రాజెక్ట్‌లు!

మరిన్ని వార్తలు