సోనూసూద్‌.. ఐటీ దాడులు ఉధృతం, రూ.20 కోట్ల పన్ను ఎగవేత?

18 Sep, 2021 13:48 IST|Sakshi

సోనూ సూద్‌ నివాసాలు, కార్యాలయాల్లో జరుపుతున్న దాడులపై ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్పందించారు. సోనూసూద్‌, అతని సహచరులు సుమారు రూ.20 కోట్లు పన్ను ఎగ్గోట్టారని ఐటీ శాఖ చెబుతోంది. అంతేకాదు Foreign Contribution (Regulation) Act నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. సోనూసూద్‌ లెక్కలు చూపని ఆదాయాన్ని అనేక బోగస్ సంస్థల నుండి అసురక్షిత రుణాల రూపంలో తీసుకున్నట్లు చెప్పారు. 

పన్నుల ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌పై శనివారం ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీతో ఒప్పందంతో పాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టిన అధికారులు సోనూసూద్‌ సంబంధం ఉన్న 28 ప్రాంతాల్లో మూడో రోజు సోదాల్ని కొనసాగిస్తున్నారు. ముంబై, లక్నో, కాన్పూర్‌, జైపూర్‌, ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ (సీబీడీటీ)  అధికారులు తెలిపారు. 

మండిపడ్డ ఆమ్‌ ఆద్మీ, శివ్‌ సేన
గత బుధవారం నుంచి ఐటీ అధికారులు సోనూసూద్‌, అతని సహచరుల ఇళ్లల్లో జరుపుతున్న దాడులపై ఆమ్‌ ఆద్మీ, శివసేన పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్‌ టార్గెట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ సోనూ సూద్‌ని ప్రశంసించేది. కానీ  ఢిల్లీ- పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పన్ను ఎగవేతదారుడిగా ముద్రవేస్తుందని శివసేన వ్యాఖ్యానించింది.  

కాగా, మహమ్మారి సమయంలో వలస కార్మికుల్ని వారి స్వగ్రామాలకు చేర‍్చించిన విధానం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ సోనూని ఆప్‌ పార్టీ తరపున దేశ్‌ కా మెంటర్‌గా నియమించారు.  అయితే ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్..,సోనూసూద్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు. సత్య మార్గంలో లక్షలాది ఇబ్బందులు ఉన్నాయి, కానీ సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కష్టకాలంలో ఉన్న సోనుసూద్‌కి మద్దతుగా లక్షలాది కుటుంబాల ప్రార్థనలు ఉన్నాయని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు