ఇన్ఫోసిస్‌ షాకింగ్‌ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..!

20 Apr, 2022 12:06 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. టాప్-5 భారతీయ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు ఇన్ఫోసిస్‌తో సమానమైన టీసీఎస్‌, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయకూడదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ కొత్త నిబంధనను తెచ్చింది. రాజీనామా చేసిన ఉద్యోగులకే కాకుండా కొత్తగా ఇన్ఫోసిస్‌లో జాయిన్‌ అయ్యే ఉద్యోగుల ఆఫర్‌ లెటర్‌లో కూడా ఈ నిబంధనను జోడించింది. 

ఆందోళనలో ఐటీ ఉద్యోగులు..!
ఇన్ఫోసిస్‌ తెచ్చిన కొత్త నిబంధనపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం తలుపుతట్టింది. ఇన్ఫోసిస్‌ నిర్ణయంపై కార్మిక మంత్రిత్వశాఖకు ప్రముఖ ఐటీ ఉద్యోగుల సంఘం  నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ఫిర్యాదు చేసింది.ఇన్ఫోసిస్‌ తెచ్చిన క్రూర నిబంధనపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఇన్ఫోసిస్‌ తెచ్చిన నిబంధన కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల హక్కులను నైతికంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. 

వలసలను ఆపేందుకు గానే..!
భారత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్‌ రేటు గణనీయంగా పెరిగింది. ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్‌ రేటు భారీగా ఉంది. గత 3 నెలల్లో 80,000 మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇక కంపెనీ అట్రిషన్‌ రేటు గణనీయంగా  27శాతంకు పెరిగింది.  ఇన్ఫోసిస్‌ నుంచి ఉద్యోగుల వలసలను ఆపేందుకు గాను కంపెనీ ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్‌లోని అన్నీ ఐటీ కంపెనీల్లో అట్రిషన్‌ రేటు ఇదే స్థాయిలో ఉండడం గమనార్హం. 

చదవండి: వరుసగా మూడోసారి రిలయన్స్‌ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్‌టెల్‌

మరిన్ని వార్తలు