ఈ కోర్స్‌ల‌కు భారీ డిమాండ్‌, 50 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. హాట్‌ హాట్‌గా!

18 Feb, 2022 16:30 IST|Sakshi

ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఐటీ ఉద్యోగాల‌పై ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న స్టాక్ మార్కెట్‌, రియ‌ల్ ఎస్టేట్‌, ఐటీ ఉద్యోగాలతో పాటు ఇత‌ర అంశాల‌పై మాట్లాడారు. 

ఇటీవ‌ల ట్యాగ్డ్ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. ఆ సంస్థ ఆ స‌ర్వే ఆధారంగా.. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు రానున్న ఐదేళ్ల‌లో 50ల‌క్షల మంది ఉద్యోగుల నియామాల్ని చేప‌డ‌తాయ‌ని రాకేష్ ఝ‌న్‌ఝ‌న్‌వాలా అన్నారు. ముఖ్యంగా కోవిడ్ త‌ర్వాత గాడిన‌ప‌డుతున్న ఎకానమీ తీరుతో నియామ‌కాలు భారీ ఎత్తున జ‌రుగుతాయ‌ని జోస్యం చెప్పారు.   
 
స‌ర్వే ఏం చెబుతోంది
కొద్దిరోజుల క్రితం ట్యాగ్డ్ జరిపిన ఒక సర్వేలో మహమ్మారి తర్వాత ఎకాన‌మీ పుంజుకోవ‌డంతో 31 శాతం నియామాకాలు పెరుగుతాయ‌ని తేలింది. ఇక ఈ ఏడాది జ‌రిగే ఉద్యోగాలు నియామ‌కంలో 56 శాతం కంటే ఎక్కువ శాతం 0-5 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగుల ఎంపిక అధికంగా ఉండ‌నుంది.  

టాప్ స్కిల్స్
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషీన్ లెర్నింగ్‌, యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌, డేటా అన‌లిటిక్స్‌, డేటా సైన్స్ వంటి విభాగాల‌కు చెందిన ఉద్యోగాల‌కు హాట్ కేకుల్లా నియ‌మ‌కాలు జ‌రుగుతాయ‌ని ట్యాగ్డ్ చేసిన సర్వేలో తేలింది.  

ఫ్రెషర్స్ కు బంప‌రాఫ‌ర్  
రానున్న రెండేళ్ల‌లోపు ఐటీ విభాగంగా ఫ్రెష‌ర్స్‌, రెండేండ్ల లోపు అనుభ‌వం ఉన్న వారికి  డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని విప్రో చీఫ్ హ్యూమ‌న్ రిలేష‌న్స్ అధికారి సౌర‌వ్ గొహిల్ పేర్కొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "మేము మా వర్క్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నాన్-ఇంజనీర్ ఫ్రెషర్‌లను కూడా రెట్టింపు చేసాము. వర్క్‌ఫోర్స్‌లో మహిళల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని, ఇందుకోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించామ‌ని గోవిల్ చెప్పారు.

మరిన్ని వార్తలు