జీ గ్రూప్‌కు షాక్‌: ఐటీ సోదాలు

4 Jan, 2021 20:29 IST|Sakshi

ముంబై: ప్రముఖ టీవీ చానెల్‌ గ్రూప్‌ ‘జీ’ కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 15కి పైగా చోట్ల తనిఖీలు చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడటంతోపాటు బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను జీ గ్రూప్‌ దాఖలు చేసిందని ఐటీ అధికారులు చెప్పారు. దీంతో పాటు లార్సెన్ అండ్‌ టౌబ్రో (ఎల్ అండ్ టీ) కంపెనీలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. (చదవండి: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు)

‘జీ’ గ్రూప్‌ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సమాచారాన్ని ఆదాయ పన్నుశాఖ అధికారులతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇంటెలిజెన్స్‌ (డీజీసీఈఐ) షేర్‌ చేసుకుందని అధికార వర్గాల కథనం. పన్ను ఎగవేత కేసులో వివిధ గ్రూపులకు చెందిన కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిపామని ఓ ఐటీ అధికారి వెల్లడించారు. ఇక ఐటీ సోదాలపై జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు