ఐటీకి కలిసొచ్చిన కరోనా : ఎక్కువ జీతాలు ఎక్కడో తెలుసా? 

24 Feb, 2021 08:20 IST|Sakshi

ప్రతి నెలా ఉద్యోగ నియామకాల్లో వృద్ధి 

జనవరిలో 39 శాతం పెరుగుదల: సైకి నివేదిక

సాక్షి,ముంబై: కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాల్లో కోలాహలం మొదలైంది. ప్రతి నెలా జాబ్స్‌ రిక్రూట్‌మెంట్‌లో వృద్ధిని నమోదవుతూనే ఉంది. క్రితం నెలతో పోలిస్తే జనవరి నెలలో జాబ్స్‌ పోస్టింగ్స్‌లో 39 శాతం పెరుగుదల కనబరిచిందని జాబ్స్, బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ సైకి తెలిపింది. ఐటీ తర్వాత అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగం బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ). 10 శాతం పెరుగుదలతో బీపీఓ, 6 శాతంతో బ్యాంకింగ్‌ రంగాలు ఉన్నాయని సైకి పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ వంటి మెట్రో నగరాలలో జాబ్‌ పోస్టింగ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఈ రంగంలో 50 శాతానికి పైగా ఉద్యోగాలున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా జాబ్‌ పోస్టింగ్‌ డేటాను విశ్లేషించింది. (రిలయన్స్‌ సంచలన నిర్ణయం)

ఎక్కువ జీతాలు హైదరాబాద్, బెంగళూరులోనే.. 
అత్యధిక వేతనాలను అందించే నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. ఐటీ ఉద్యోగాలకు రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ పారితోషకాలను ఇచ్చే నగరాలివేనని తెలిపింది. ఐటీ రంగంలో 47 శాతం ప్రాజెక్ట్‌ మేనేజర్లకు డిమాండ్‌ ఉంది. ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్‌లో 6 శాతం, బ్యాంకింగ్‌లో 4 శాతం, రిక్రూట్‌మెంట్‌లో 3 శాతం డిమాండ్‌ ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పోలిస్తే డిజిటల్‌ మార్కెటింగ్‌ 30 శాతం నియామకాలతో అగ్రస్థానంలో ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి పొందండంలో ఐటీ రంగం అసాధరణమైన పురోగతిని సాధించింది. డిజిటల్‌ పరివర్తనం, రిమోట్‌ వర్క్‌ వంటి వాటితో అనేక రంగాల ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో ఐటీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని సైకి కో-ఫౌండర్‌ అక్షయ్‌ శర్మ తెలిపారు.

చదవండిజూమ్‌ కితకితలు : ప్యాంట్‌ లేకుండానే

మరిన్ని వార్తలు