ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి.. కానీ..

20 Nov, 2022 08:12 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో ఉందిది. రోమ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వియా వెనెటోకు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవంతి పదహారో శతాబ్దం నాటిది. దీని సీలింగ్‌పై ఆనాటి సుప్రసిద్ధ ఇటాలియన్‌ చిత్రకారుడు కరవాగియో చిత్రించిన మ్యూరల్స్‌ ఈ భవంతికి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ భవంతి విస్తీర్ణం 30 వేల చదరపు అడుగులు.

ఇటలీలోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతిలో ప్రస్తుతం ప్రిన్స్‌ నికోలా లుదోవిసీ బోన్‌కాంపానీ మూడో భార్య ప్రిన్సెస్‌ రీటా బోన్‌కాంపానీ లుదోవిసీ ఉంటున్నారు. ప్రిన్స్‌ నికోలో మొదటి భార్య సంతానం ఆస్తి కోసం దావా వేయడంతో ఈ భవంతిని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఏడాది జనవరిలోను, ఆ తర్వాత ఏప్రిల్‌లోను దీనికి వేలం ప్రకటించినా, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

అపర కుబేరులెవరైనా ముందుకొస్తే తప్ప ఈ భవంతిని వేలంలో అమ్మడం సాధ్యం కాదని ఇటాలియన్‌ అధికారులు అంటున్నారు. వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిని ఇటాలియన్‌ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రిన్సెస్‌ రీటా దాదాపు 40 వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక పిటిషన్‌ను సమర్పించారు. అయితే, ఈ భవంతి విలువ ఇటలీ సాంస్కృతిక శాఖ బడ్జెట్‌కు మించి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్‌!..ట్విటర్‌,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!

మరిన్ని వార్తలు