Twitter Former CEO Jack Dorse: గుడ్‌బై ట్విటర్‌.. ఇక సెలవు..

26 May, 2022 13:17 IST|Sakshi

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో, ప్రస్తుత బోర్డు మెంబర్‌ జాక్‌డోర్సే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పెంచి పోషించిన సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకున్నాడు. ఈలాన్‌ మస్క్‌ ఎంట్రీ ప్రకటన నుంచి అతలాకుతలం అవుతున్న ట్విటర్‌కి తాజా పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మార్చాయి. 

ట్విటర్‌ సీఈవోగా తన పదవీ బాధ్యతల నుంచి  2022 నవంబరులో జాక్‌డోర్సే తప్పుకున్నారు. అప్పటి నుంచి ట్విటర్‌ సీఈవోగా ఐఐటీ బాంబే, పూర్వ విద్యార్థి పరాగ్‌ అగ్రవాల్‌ కొనసాగుతున్నారు. సీఈవో పోస్టు నుంచి తప్పుకున్నప్పటికీ కీలకమైన ట్విటర్‌ బోర్డులో సభ్యుడిగా జాక్‌డోర్సే కొనసాగుతున్నారు.  ఆయన పదవీ కాలం 2022లో జరిగే బోర్డు సమావేశం వరకు ఉంది. అయితే ఆ సమావేశానికి ముందుగానే బోర్డు నుంచి ఆయన వైదొలిగారు. 

ఈలాన్‌ మస్క్‌ 2022 ఏప్రిల్‌లో ట్విటర్‌ను ఏకమొత్తంగా కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌ ఆఫర్‌ చేశారు. మస్క్‌ ప్రకటన తర్వాత ట్విటర్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మస్క్‌ ఆఫర్‌ చేసిన డీల్‌ కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ట్విటర్‌ బోర్డు కనుమరుగు అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ కొనుగోలు ప్రక్రియను హోల్డ్‌లో పెట్టారు ఈలాన్‌ మస్క్‌. ఓ వైపు బోర్డు కొనసాగుతుందా లేదా అనే డోలాయమాన పరిస్థితులు ఉండగా మరోవైపు బోర్డులో కీలక సభ్యుడిగా ఉన్న జాక్‌డోర్సే ఆ స్థానం నుంచి తప్పుకున్నారు.

ఈలాన్‌ మస్క్‌ ఎంట్రీ ప్రకటనతో షేర్‌హోల్డర్లు సంతోషం వ్యక్తం చేయగా బోర్డు సభ్యులు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో బోర్డు పనితీరు సరిగా లేదంటూ మస్క్‌ అనేక ఆరోపణలు చేశారు. ఇదిలా కొనసాగుతుండగా ట్విటర్‌లో హై లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇద్దరికి ఉద్వాసన పలికారు సీఈవో పరాగ్‌ అగ్రవాల్‌. ఈ వేడి చల్లారక ముందే ఈలాన్‌ మస్క్‌ ఫేక్‌ ఖాతాల అంశం లేవనెత్తి మరింత గందరగోళం సృష్టించారు. ఫేక్‌ అకౌంట్ల జడివాన సద్దుమణగక ముందే బోర్డు నుంచి జాక్‌డోర్సే నిష్క్రమణ జరిగింది. 

చదవండి: Elon Musk : ట్విటర్‌ పని అయ్యింది.. ఇప్పుడు ఇన్‌స్టా వంతా?

మరిన్ని వార్తలు