టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్‌ ఆమే...

20 Mar, 2023 18:20 IST|Sakshi

ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్‌ చైర్‌ పర్సన్‌ జయంతి చౌహాన్‌ నడిపించనున్నారు. బిజినెస్‌ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్‌ పడినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్‌ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్‌ రమేష్‌ చౌహాన్‌ తాజాగా తెలిపారు.

ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!

ది ఎకనామిక్ టైమ్స్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్‌ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్‌ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు.

 

42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్‌ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్‌పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్‌ చౌహాన్‌ అప్పట్లో చెప్పారు.

ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్‌ వాచ్‌!.. ఎలాగంటే... 

టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్‌ టైమ్స్‌ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు