Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు భారీ షాక్‌

18 Nov, 2022 20:57 IST|Sakshi

ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థ భవిష్యత్‌ కోసం పొదుపు మంత్రం జపిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి వేతనాలు చెల్లించకుండా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 50 శాతం వరకు జీతంలో కోత పెట్టనుంది. 

2019లో ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌ జలాన్‌కర్లాక్‌ సంస్థ దక్కించింది. నూతన యాజమాన్యం ఈ ఏడాది నుంచి తిరిగి సర్వీసుల్ని ప్రారంభించాలని భావించింది. కానీ ఇప్పుటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన జీత భత్యాలపై ఉద్యోగులు, సిబ్బంది సంఘం నేషనల్‌ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ను ఆశ్రయించారు. దీంతో కథ మొదటికొచ్చింది. సర్వీసుల పునప్రారంభం కంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని నూతన యాజమాన్యాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జలాన్‌ కర్లాక్‌ కన్సార్షియం ఎయిర్‌లైన్స్‌ పూర్తి స్థాయిలో తాము ఆధీనంలోకి రాలేదని, ఇందుకోసం తగిన సమయం పడుతోందంటూ ఎన్‌సీల్‌ఏటీకి వివరణిచ్చింది. కాగా, సిబ్బందిని సెలవులపై ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. నిధుల్ని ఆదా చేసేందుకు ఈ తరహా చర్యలకు దిగింది.   

మరిన్ని వార్తలు