తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో

14 May, 2021 12:31 IST|Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో జియో రోజు రోజుకి వినియోగదారుల సంఖ్య పెరుగుతూ పోతుంది. వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ట్రాయ్ తాజాగా విడుదల చేసిన టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో ఫిబ్రవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందారులను ఆకట్టుకుంది. తర్వాత స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ 72,559 మొబైల్ చందాదారులను ఆకట్టుకోగా వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది చందాదారులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోయని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి.

దీంతో ఏపీ టెలికాం సర్కిల్(ఏపీ,తెలంగాణ)లో జియో టెలికాం మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఫిబ్రవరి నాటికి 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో దాదాపు 40 శాతం కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా జియో అత్యధికంగా 42.66 లక్షల మంది కొత్త చందాదారులను ఆకట్టుకుంది. ఎయిర్ టెల్ కు కొత్తగా మరో 37.3 లక్షల చందాదారులు వచ్చి చేరారు. ఇక వోడాఫోన్ ఐడియా 6.5 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం దేశ వ్యాప్తంగా 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2021లో కొత్తగా దేశం మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య 82,92,668కు పెరిగింది.

ఇంటర్నెట్ స్పీడ్ పరంగా కూడా జియోనే మొదటి స్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం సెకనుకు 20.1 ఎంబీపీస్ వేగంతో జియో డౌన్ లోడ్ పరంగా అగ్రస్థానంలో ఉంది. ఇక తన సమీప పోటీదారుడు వోడాఫోన్‌ 7ఎంబీపీస్ డౌన్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. ఐడియా (5.8 ఎమ్‌బిపిఎస్), ఎయిర్ టెల్ 5 ఎమ్‌బిపిఎస్  డౌన్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. అప్‌లోడ్ విషయంలో మాత్రం వోడాఫోన్ 6.7 ఎమ్‌బిపిఎస్‌ వేగంతో  మొదటి స్థానంలో నిలిచ్చింది. అప్‌లోడ్ పరంగా దీని తర్వాత స్థానంలో ఐడియా (6.1 ఎమ్‌బిపిఎస్), జియో (4.2 ఎమ్‌బిపిఎస్), ఎయిర్ టెల్ (3.9 ఎమ్‌బిపిఎస్) ఉన్నాయి.

చదవండి:

సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు కంపెనీలు

మరిన్ని వార్తలు