Reliance AGM 2021: ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో

24 Jun, 2021 15:52 IST|Sakshi

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. 

జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. 

చదవండి: ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్

మరిన్ని వార్తలు