రిలయన్స్ జియో మరో బంపర్‌ ఆఫర్‌..

24 Sep, 2020 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో రిలయన్స్‌ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే వారికి జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే 22 విమానాలలో రోజుకు రూ.499తో మొబైల్‌ సేవలు అందించనుంది. అయితే రిలయన్స్‌ భాగస్వామ్య సంస్థలైన కాథే పసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాడ్ ఎయిర్‌వేస్, యూరో వింగ్స్, లుఫ్తాన్స, మలిండో ఎయిర్, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, లిటాలియా తదితర విమాన సంస్థలలో జియో మొబైల్‌ ఆఫర్‌ వర్తించనుంది. కాగా భారత్‌ నుంచే ప్రయాణించే విదేశీ ప్రయాణికుల కోసం మూడు రోమింగ్‌ ప్యాక్‌లను జియో ప్రకటించింది.

ఒక రోజు వాలిడిటీ సేవలను రూ.499, రూ.699, రూ.999 ధరలతో జియో ప్రకటించింది. అయితే జియో అన్ని ప్లాన్స్‌లలో 100 నిమిషాల అవుట్‌ గోయింగ్ వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. కాగా రూ.499 ప్లాన్‌తో 250 మెగాబైట్ (ఎమ్‌బీ) మొబైల్ డేటాను అందిస్తుంది. మరోవైపు రూ.699తో 500ఎమ్‌బీ అందిస్తుండగా, రూ.999తో 1జీబీ డేటాను పొందవచ్చు. అయితే జియో ఆఫర్‌లో ఇన్‌కమింగ్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ ఉచితమని సంస్థ ప్రకటించింది. మరిని వివరాల కోసం www.jio.comను సందర్శించవచ్చు.

>
మరిన్ని వార్తలు