మొబైల్ యూజర్లకు ఊరట!

21 Mar, 2021 15:01 IST|Sakshi

దేశీయ మొబైల్ రంగంలో కొద్దీ రోజుల నుంచి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. రేపో, మాపో టారిఫ్‌ల పెంపు తప్పదనేలా ఇటీవలి వరకు వార్తలు వచ్చేవి. పరిశ్రమ మనుగడ కోసం చార్జీల పెంపు తప్పదని, అలాగే 4జీ  నెట్‌వర్క్‌ విస్తృతి కోసం టారిఫ్ చార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు గతంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ప్రకటిస్తూ వచ్చాయి. అయితే, ప్రస్తుతం టెలికాం మార్కెట్ లీడర్ జియో మాత్రం భిన్నంగా చర్యలు తీసుకుంది. ధరలు పెంపు విషయానికి వెళ్లకుండా కొత్త మార్గాన్ని అన్వేషించింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా 2జీ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం కొత్తగా జియో ఫీచర్‌ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. 

రూ.1999కే జియో ఫీచర్ ఫోన్‌ తో పాటు రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, డేటా ఆఫర్‌ ఇవ్వడంతో ఇప్పట్లో ఛార్జీల పెంపునకు సుముఖంగా లేమనే సంకేతాలు జియో ఇచ్చినట్లయ్యింది. దింతో మిగతా కంపెనీలు 
చార్జీలు పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇది మిగిలిన నెట్‌వర్క్‌ సంస్థలకు ఇబ్బంది కరమే అయినా, ప్రస్తుతానికి వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో ఉన్న 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను 4జీకి మార్చడమే తమ లక్ష్యమంటూ గతవారం ‘కొత్త జియోఫోన్‌ 2021’ను రిలయన్స్‌ జియో విడుదల చేసింది. 

రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, ప్రతి నెల 2జీబీ డేటా, కొత్త జియోఫోన్‌లను కేవలం రూ.1999కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇది టెలికామ్ సర్కిల్లో సంచలనంగా మారింది. అలాగే, ఇప్పటికే జియోఫోన్ ఉన్న‌ వినియోగదారులు ఏడాదికి రూ.749 చెల్లించి అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలు పొందొచ్చు. దీంతోపాటు నెలకు రూ.22 నుంచి మరో 5 ప్రీపెయిడ్‌ పథకాలను కూడా జియోఫోన్‌ చందాదార్ల కోసం తెచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా 2జీ చందాదార్లు ఇప్పటికీ నెలకు అధిక మొత్తాలు చెల్లిస్తున్నారని, వీరికి తక్కువ ఖర్చయ్యే పథకాలతో తమ నెట్‌వర్క్‌కు ఆకర్షించగలమని జియో భావిస్తోంది. గత కొంత కాలంగా జియో ఖాతాదారుల వృద్ధి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ జియోఫోన్‌తో మళ్లీ గాడిలో పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి:

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం

>
మరిన్ని వార్తలు