జేఎంసీ ప్రాజెక్ట్స్‌ జూమ్‌- కేఆర్‌బీఎల్‌ డీలా

12 Aug, 2020 10:36 IST|Sakshi

తాజాగా రూ. 1363 కోట్ల విలువైన ఆర్డర్లు

10 శాతం దూసుకెళ్లిన జేఎంసీ ప్రాజెక్ట్స్‌ షేరు

క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు

6.5 శాతం పతనమైన కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌

కోవిడ్‌-19 కట్టడికి రష్యాలో వ్యాక్సిన్‌ను విడుదల చేసినప్పటికీ ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ బాటలో దేశీ మార్కెట్లు సైతం నేలచూపులతో కదులుతున్నాయి. అయితే తాజాగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పనితీరు నిరాశపరచడంతో బాస్మతి బియ్యం ఎగుమతుల సంస్థ కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

జేఎంసీ ప్రాజెక్ట్స్
దక్షిణాది నుంచి బిల్డింగ్‌ ప్రాజెక్టుల విభాగంలో రూ. 1,169 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందినట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో బీహార్‌ నుంచి నీటి సరఫరా ప్రాజెక్టు కోసం రూ. 194 కోట్ల ఆర్డర్‌ లభించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జేఎంసీ ప్రాజెక్ట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 53 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 55 వరకూ ఎగసింది.

కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌
ఇండియాగేట్‌ బాస్మతి బ్రాండ్‌ కంపెనీ కేఆర్‌బీఎల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో 8 శాతం క్షీణించింది. రూ. 126 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 773 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 17 శాతం వెనకడుగుతో రూ. 199 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో కేఆర్‌బీఎల్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం పతనమై రూ. 290కు చేరింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు