ఐపీఓకు కల్యాణ్‌ జువెలర్స్‌

1 Aug, 2020 10:32 IST|Sakshi

ముసాయిదా పత్రాలను సిద్ధం చేస్తున్న కంపెనీ

ఇష్యూ ద్వారా రూ.1,600-1,800 కోట్ల సమీకరణ

కేరళ ఆధారిత ఆభరాణాల రిటైల్‌ దిగ్గజం కల్యాణ్‌ జువెలర్స్‌ ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఐపీఓ ఇష్యూకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ ఆగస్ట్‌ చివరిలో లేదా సెప్టెంబర్‌లో ఐపీఓ అనుమతుల కోసం సెబీకి ముసాయిదా ప్రణాళిక పత్రాలను సమర్పించనుంది. కోవిడ్‌-19 వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా క్రమంగా ఆభరణాలకు డిమాండ్‌ పెరగవచ్చనే అంచనాలతో ఐపీఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కల్యాణ్‌ జువెలరీస్‌ ప్రాథమిక, సెంకడరీ మార్కెట్లలో షేర్ల ఇష్యూ జారీ ద్వారా రూ.1,600-రూ.1,800కోట్ల నిధులను సమీకరించాలని చూస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీకి గణనీయమైన వినియోగదారులు ఉన్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగం నెమ్మదిగా పుంజుకోవడం కంపెనీకి విశ్వాసాన్ని ఇచ్చింది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. వాస్తవానికి కంపెనీ 2018లోనే ఐపీఓకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఐపీఓ వాయిదాపడింది. 

యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటి, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సెబీ క్యాపిటల్‌ మొదలైన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు ఐపీఓ కోసం పనిచేస్తున్నాయి. ఐపీఓ ద్వారా వార్బర్గ్ పిన్కస్ కొంతవాటాను తగ్గించుకోనుంది. కంపెనీకి కూడా రుణభారాన్ని తగ్గనుంది. కల్యాణ్‌ జువెలరీస్‌లో వార్బర్గ్‌ పిన్కస్‌కు 2019 సెప్టెంబర్‌ నాటికి 30శాతం వాటాను కలిగి ఉన్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా గణాంకాలు చెబుతున్నాయి.సెబీ, స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ల క్లియరెన్స్‌ లాంటి అవసరమైన ఆమోదాలను పొందిన తర్వాత వచ్చే ఏడాది జనవరి-మార్చి ఐపీఐ ప్రారంభం కావచ్చు. కల్యాణ్‌ జువెలర్స్‌కు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 135 షోరూమ్‌లు, 328 విక్రయశాలున్నాయి. అలాగే 5దేశాల్లో బ్రాంచులున్నాయి. 

మరిన్ని వార్తలు