రానున్న రోజుల్లో మరింత అందుబాటులోకి: కేఎఫ్‌సీ

29 Mar, 2021 15:52 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా ఆధారిత ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ)భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్‌వర్క్‌ను విస్తరింపజేయాలని ఆలోచిస్తోంది. కరోనావైరస్ కారణంగా తమ వ్యాపారంలో  నిర్మాణాత్మక మార్పులను చోటుచేసుకునప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కేఎఫ్‌సీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతందని నమ్ముతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


మా బ్రాండ్‌ను విస్తరింపచేయడమే మా ప్రధాన లక్ష్యం. మా కస్టమర్లకు అన్నిరకాల అందుబాటులో ఉంటూ మా బ్రాండ్‌ విలువను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేఎఫ్‌‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. కోవిడ్‌ రాకముందు కేఎఫ్‌సీకి ఇండియాలో రెస్టారెంట్ల సంఖ్య 450 గా ఉండేది. ప్రస్తుతం130 కి పైగా నగరాల్లో 480 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి.

భవిష్యత్తులో కేఎఫ్‌సీ మరింత అందుబాటులోకి

రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా కేఎఫ్‌సీకి భారత్‌ మంచి మార్కెట్ అవుతుందనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ ఆర్డర్‌లు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేలా కేఎఫ్‌సీ ఇండియా తన ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఆయన అన్నారు.

కోవిడ్ ప్రారంభం నుంచి ప్రస్తుతం వరకు చూస్తే మా ఆన్‌లైన్ వ్యాపారం కనీసం 50 శాతం పెరిగిందని మేము భావిస్తున్నాము. మరోవైపు, కోవిడ్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదనే చెప్పాలి. మాల్స్, ఫుడ్ కోర్టులలో మా కస్టమర్ల రాకను కోవిడ్‌కు ముందు  పోల్చి చూస్తే  ప్రస్తుతం తక్కువగా వస్తున్నారని గమనించాము. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది.

కోవిడ్-19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతూ సంస్థ గత సంవత్సరం ఎదుర్కున్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకున్నాం. ప్రస్తుతం ఆహార భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌, కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ డెలివరీలు లాంటివి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపారు. కోవిడ్‌ ఆంక్షలు కారణంగా డైనింగ్‌ హాళ్లను మళ్లీ తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి వచ్చినా, మా కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలను  తీసుకుంటామని మీనన్ అన్నారు.

>
మరిన్ని వార్తలు