సరికొత్త రికార్డ్‌..దుమ్మురేపుతున్న కియా కార్ల అమ్మకాలు!

20 Jul, 2022 07:24 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా గడిచిన మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని అధిగమించింది. తక్కువ కాలంలో ఈ ఘనతను సాధించిన కార్ల తయారీ కంపెనీ తామేనని కియా వెల్లడించింది. 

అలాగే గడిచిన నాలుగున్నర నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఎగుమతులతో కలిపి ఈ మూడేళ్లలో కంపెనీ 6,34,224 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సెల్టోస్‌ మోడల్‌దే ప్రధాన వాటాగా ఉంది. అంతర్జాతీయంగా కియా మొత్తం అమ్మకాల్లో భారత వాటా 6 శాతానికి పైగా ఎగసింది. ‘భారత్‌లో మూడేళ్లలో ట్రెండ్‌ సృష్టించాం.

స్పూర్తిదాయక బ్రాండ్‌గా స్థిరపడటమేగాక నూతన సాంకేతికతలను స్వీకరించడంలో సైతం నాయకత్వం వహించాం’ అని కియా ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న టచ్‌ పాయింట్ల సంఖ్య 339 నుంచి డిసెంబర్‌ నాటికి 400లకు చేర్చనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లాలో కియా తయారీ కేంద్రం ఉంది.  

మరిన్ని వార్తలు