Birla Tyres: అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!

10 May, 2022 08:43 IST|Sakshi

బిర్లా టైర్స్‌పై దివాలా చర్యలు

ఎన్‌సీఎల్‌టీ కోల్‌కతా బెంచ్‌ ఆదేశాలు 

న్యూఢిల్లీ: బిర్లా టైర్స్‌ లిమిటెడ్‌పై దివాలా చర్యలను ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా బెంచ్‌ ఆదేశించింది. బీకే బిర్లా గ్రూప్‌ సంస్థ– బిర్లా టైర్స్‌ రుణదాత, మల్టీ–బిజినెస్‌ కెమికల్స్‌ సంస్థ ఎస్‌ఆర్‌ఎఫ్‌ దాఖలు చేసిన కేసులో బెంచ్‌ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనల ప్రకారం,  బోర్డు ను సస్పెండ్‌ చేసి, మారటోరియం విధించిన ట్రి బ్యునల్, కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి సీక్‌ అబ్దుల్‌ సలామ్‌ను మధ్యంతర రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పీ)గా నియమించింది. 

టైర్‌ కార్డ్‌ ఫ్యాబ్రిక్‌ సరఫరాలకు సంబంధించి 2021 జూలై 8వ తేదీ నాటికి బిర్లా టైర్స్‌ తనకు రూ. 15.84 కోట్లు చెల్లించాలని ఎస్‌ఆర్‌ఎఫ్‌ దివాలా పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో రూ. 10.06 కోట్ల అసలుకాగా,  5.78 కోట్లు వడ్డీ. రుణ డిఫాల్ట్‌కు సంబంధించి ఎస్‌ఆర్‌ఎఫ్‌ సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందినట్లు ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఐబీసీ సెక్షన్‌ 9 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బిర్లా టైర్స్‌ చాలా ఆషామాషీగా తీసుకుని, వాయిదాలు తీసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోందని ట్రిబ్యునల్‌ సభ్యులు (టెక్నికల్‌) హరీష్‌ చందర్‌ మరో  సభ్యులు (జుడీషియల్‌) సూరి రోహిత్‌ కపూర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్‌ఆర్‌ఎఫ్‌ పిటిషన్‌పై బిర్లా టైర్స్‌కు ఎన్‌సీఎల్‌టీ 2021 అక్టోబర్‌ 20న నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రిప్లై ఇవ్వడానికి మూడు ద ఫాలు బిర్లా టైర్స్‌ వాయిదాలు తీసుకోవడం గమనార్హం.  
చదవండి: ఓయో ఖాతాలో డైరక్ట్‌ బుకర్‌

మరిన్ని వార్తలు