దూసుకుపోతున్న డిజిటల్‌ ఎకానమీ 

27 Feb, 2023 04:59 IST|Sakshi

జీడీపీలో 25 శాతానికి చేరుకోవచ్చు 

ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ 

ముంబై: డిజిటల్‌ ఆర్థిక కార్యకలాపాలు మరింతగా వృద్ధి చెందుతాయని, 2028–29 ఆర్థిక సంవత్సరం చివరికి అదనంగా సమకూరే దేశ జీడీపీలో పావు వంతు వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ అంచనా వేశారు. 2029 మార్చి నాటికి దేశ జీడీపీ 7 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీలో డిజిటల్‌ ఆర్థిక కార్యకలాపాల వాటా 4 శాతంగా ఉంటే, చైనాలో 40 శాతంగా ఉండడం గమనార్హం. డిజిటల్‌ ఆర్థిక కార్యకలాపాలు అంటే డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ కామర్స్, డిజిటల్‌ చెల్లింపులు, సేవలు తదితర వాటిని కామత్‌ ఉదాహరణగా పేర్కొన్నారు.

చైనా జీడీలో డిజిటల్‌ ఆర్థిక కార్యకలాపాలు 40 శాతం సమకూరుస్తున్నాయని, మన దగ్గరా ఆ స్థాయికి చేరుకోకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కామత్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా అభివృద్ధి బ్యాంక్‌ (నాబ్‌ఫిడ్‌) చైర్మన్‌గా ప్రస్తుతం కామత్‌ పనిచేస్తున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు మరిన్ని మౌలిక సదుపాయాల అవసరం ఉంది. రవాణా, ఎక్స్‌ప్రెస్‌వే, హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్‌ల పరంగా మనం ఎంతో చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రజల రవాణాకు, వస్తు రవాణాకు వీలుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్‌ రహదారులు, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు, పెద్ద ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయి’’అని కామత్‌ వివరించారు.    

మరిన్ని వార్తలు