స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు బాగా సంపాదించాలంటే...ఈ టిప్స్‌ తెలిస్తే చాలు!

28 Nov, 2022 06:56 IST|Sakshi

పెట్టుబడులకు కొన్ని విధానాలు అంటూ ఉంటాయి. ఆచరణీయ సూత్రాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో సంపదను సృష్టించుకున్న ప్రతీ ఇన్వెస్టర్‌ విజయం వెనుక కచ్చితంగా వీటి పాత్ర ఉంటుంది. అనుభవం మీద కానీ, వీటి గురించి ఇన్వెస్టర్లకు తెలియదు. ‘డబ్బులతో మార్కెట్లోకి అడుగుపెడితే అనుభవం మిగులుతుంది. అనుభవంతో మార్కెట్లోకి ప్రవేశిస్తే సంపద సృష్టి జరుగుతుంది’ అని చెబుతుంటారు.

అందుకని మార్కెట్‌ పండితులు అనుసరించిన విధానాలను ముందే తెలుసుకుంటే, విలువైన సమయం ఆదా చేసుకోవడంతోపాటు, కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని మూటగట్టుకోవచ్చు. అమెరికాకు చెందిన సర్‌ జాన్‌ టెంపుల్‌టన్‌ ప్రపంచంలోని దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరు. 38 ఏళ్లపాటు ఏటా తన పెట్టుబడులపై 15 శాతం చొప్పున కాంపౌండింగ్‌ రాబడులను ఆయన సంపాదించగలిగారు. ఆయన అనుసరించిన సూత్రాలను, అనుభవ పాఠాలను ఈ ప్రాఫిట్‌ ప్లస్‌ కథనంలో తెలుసుకుందాం.

తగినంత కసరత్తు 
పెట్టుబడులు పెట్టే ముందు తగినంత పరిశోధన అవసరం. విజయవంతమైన కంపెనీలకు సాయపడిన అంశాలు ఏంటన్నవి తెలుసుకోవాలి. కంపెనీల ఎర్నింగ్స్‌ (లాభాలు), ఆస్తులన్నవి స్టాక్‌ ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కంపెనీ ఎర్నింగ్స్‌ భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే అంచనాలతో ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. స్టాక్‌ ధరలు కూడా భవిష్యత్తు లాభాల అంచనాలకు తగ్గట్టే చలిస్తుంటాయి. కనుక, భవిష్యత్తులో ఇవి తారుమారు అయితే? స్టాక్స్‌ ధరలు కూడా పతనమవుతాయి. ఈ రిస్క్‌ను ముందే దృష్టిలో పెట్టుకుని అధ్యయనం తర్వాతే అడుగులు వేయాలి. 

కొని, మర్చిపోవద్దు.. 
బేర్‌ మార్కెట్‌ శాశ్వతం కాదు. అలా అని బుల్‌ మార్కెట్‌ శాశ్వతం కాదు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో స్పందించాల్సి వస్తుంది. కొనుగోలు చేసి, మర్చిపోయే స్టాక్స్‌ అన్న వి చాలా అరుదు. ఏ కంపెనీ అయినా కానీ వెలుపలి పరిణామాలకు ప్రభావితం అవుతుంటుంది. అందుకుని పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, అవసరమైతే మార్పులకు వెనుకాడొద్దు.

భయపడిపోవద్దు.. 
అందరూ ఆశావాదంతో ఎగబడి కొంటున్న వేళ విక్రయించాలని చెప్పుకున్నాం. కానీ, ఆ సమయంలో అమ్ముకోకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత మార్కెట్లు పడిపోవచ్చు. 2008, 2020లో మన స్టాక్‌ మార్కెట్‌ పతనాలు గుర్తున్నాయి కదా. ఒక్కో స్టాక్‌ ఒక రోజులో 20% వరకు నష్టపోయింది. ఆ సమయంలో భయపడిపోయి వచ్చినంత చాలనే ధోరణితో అమ్ముకో వడం సరికాదు. పతనానికి ముందే విక్రయించాలి. అది చేయలేకపోతే, ఒకసారి పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ను అధ్యయనం చేయాలి. ఏ అంశాల ఆధారంగా వాటిని కొనుగోలు చేశారో, వాటి ల్లో మార్పు రానంత వరకు మార్కెట్‌ పడిపోతుందని విక్రయించాల్సిన పనిలేదు. వేరే స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, ఉన్నవి అమ్మేసుకుని వాటిని కొనుగోలు చేసుకోవడం కూడా సరికాదు.

పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే ముందు ద్రవ్యోల్బణం, పన్నులను పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పెట్టుబడుల విధానాన్ని అనుసరించాలి. పెట్టుబడుల తర్వాత ప్రశాంతత కోల్పోయేలా ఉండకూడదు. వాస్తవ రాబడులు అంటే ఇక్కడ.. వచ్చిన రాబడి నుంచి పన్నులు చెల్లించగా మిగిలే మొత్తం. అలాగే, ద్రవ్యోల్బణాన్ని సైతం రాబడి నుంచి మినహాయించి చూడాలి. పన్నులు, ద్రవ్యోల్బణం ప్రభావం పట్టించుకోని ఏ పెట్టుబడి అయినా వైకల్యంతో సమనమేనని టెంపుల్‌టన్‌ అంటారు. 

స్పెక్యులేషన్‌ వద్దు.. 
ఈక్విటీ మార్కెట్లో స్పెక్యులేషన్‌ (అంచనాల ఆధారంగా చేసే ట్రేడింగ్‌) అన్నది వేగంగా నష్టపోయే మార్గం. స్టాక్‌ మార్కెట్‌ క్యాసినో కాదు. తరచూ స్టాక్స్‌ కొని విక్రయిస్తుండడం, ఆప్షన్లను షార్ట్‌ సెల్‌ చేస్తుండడం, ఫ్యూచర్‌ కాంట్రాక్టుల్లో ట్రేడ్‌ చేయడం ఇదంతా క్యాసినోనే అని టెంపుల్‌టన్‌ అంటారు. ఇక్కడ అంతిమంగా ఇన్వెస్టర్‌ సంపాదించేదేమీ ఉండదన్నది ఆయన నమ్మే సిద్ధాంతం. మార్కెట్‌ పెరుగుతుందని, తగ్గుతుందని అంచనాల ఆధారంగా చేసే ట్రేడ్లు ఎప్పుడూ సక్సెస్‌ కావాలని లేదు. వీటిల్లో పెట్టుబడి నష్టానికి అదనంగా.. కమీషన్లు, చార్జీల రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుంది.   
   
వాల్‌స్ట్రీట్‌ లెంజెడరీ ఇన్వెస్టర్‌ లూసీన్‌ హూపర్‌ నిర్వచనం ప్రకారం..  స్టాక్స్‌కు దీర్ఘకాల యజమానులుగా ఎంత ప్రశాతంగా ఉంటామన్నదే ముఖ్యం. ఇన్వెస్టర్‌ ఎంత ప్రశాంతంగా ఉంటే కనీస విలువల గురించి మరింతగా అర్థం చేసుకోగలడు. సహనంతో, భావోద్వేగాలకు లోను కాకుండా ఉండగలడు. తక్కువ మూలధన లాభాల పన్ను చెల్లిస్తాడు. అనవసర బ్రోకరేజీ కమీషన్లు చెల్లించే పని ఉండదు. జూదగాళ్ల మాదిరిగా ఆలోచించడు. 

మార్పునకు సిద్ధం.. 
ప్రతి పెట్టుబడుల విధానంలోనూ అనుకూల, ప్రతికూలతలు ఉంటాయి. తనకు అనుకూలమైన విధానాన్ని అనుసరిస్తూ, అవసరమైతే అందులో మార్పులు చేసుకునేందుకు సానుకూల దృక్పథంతో కొనసాగాలి. బ్లూచిప్‌ స్టాక్స్, సైక్లికల్‌ స్టాక్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్, కార్పొరేట్‌ బాండ్స్‌.. ఇలా ఒక్కో విభాగంలో పెట్టుబడులకు అనుకూల, ప్రతికూల సందర్భాలు ఉంటాయి. అంతేకాదు, అవసరమైతే నగదు రూపంలోనే కొనసాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే నగదు ఉంచుకోవడం వల్ల మంచి అవకాశాలను సొంతం చేసుకోగలరు. అందుకే ఏదో ఒక్క పెట్టుబడి విధానం అన్నది అత్యుత్తమం అని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో కొన్ని విభాగాలకు ఎంతో ఆదరణ లభిస్తుంది. అది తాత్కాలికం కావచ్చు. అటువంటప్పుడు లాభాలు దీర్ఘకాలం పాటు కొనసాగలేవు. అందుకని మార్పునకు సదా సిద్ధంగా ఉండాలి. మార్కెట్‌ పెట్టుబడి సూత్రాలకూ ఇది వర్తిస్తుంది. కాలంతోపాటు ఈ విధానాల్లోనూ మార్పులు రావచ్చు. స్మార్ట్‌ ఇన్వెస్టర్‌ అయితే దీన్ని గుర్తిస్తాడు. 

కనిష్ట స్థాయి 
కనిష్ట స్థాయిల్లో కొనుగోలు చేసి, గరిష్ట స్థాయిల్లో విక్రయించడమన్నది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ, ఆచరణ అంత ఈజీ కాదు. సాధారణంగా స్టాక్స్‌ ధరలు పెరుగుతున్నప్పుడే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులై, ఇంకా పెరుగుతుందన్న అంచనాతో కొనుగోలుకు ముందుకు వస్తుంటారు. షేరు ధర పడిపోతుంటే, ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. ఎందుకంటే తాము ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత, అది మరింత పడిపోతుందేమో, ఇక ఎప్పటికీ పెరగదేమో? అన్న భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. నిజానికి అమ్మకాల ఒత్తిడి ఉందంటే నిరాశావాదం పెరిగినట్టు. కొనుగోళ్లకు అదే సరైన సమయం. అంతేకానీ, మార్కెట్లు ఇంకా పడిపోతాయని, ఆ తర్వాతే కొనుగోలు చేద్దామని అనుకోవద్దు. నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడే స్టాక్స్‌ ఎక్కవ నష్టాలు చూస్తాయి. దాన్నే తెలివైన ఇన్వెస్టర్‌ అనుకూలంగా మలుచుకోవాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా అధిక స్థాయిల్లో కొనుగోలు చేసి, తక్కువ ధరల వద్ద విక్రయిస్తుంటారు. మార్కెట్లలో ఆశావా దం పెరిగినప్పుడు విక్రయించి, నిరాశావాదం ఎక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేయాలని విఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సైతం చెబుతుంటారు.

నాణ్యమైన స్టాక్స్‌ 
ఒక కంపెనీ వ్యాపారం ఎంత నాణ్యమైనది అనేది రాబడులకు కీలకం అవుతుంది. నాణ్యమైన వ్యాపారమే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయగలదు. కస్టమర్‌ విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. ఆయా రంగంలో టెక్నాలజీ పరంగా కంపెనీ బలమైన స్థానంలో ఉండాలి. బలమైన యాజమాన్యం, వ్యాపారాన్ని మెరుగ్గా నిర్వహించిన ట్రాక్‌ రికార్డ్‌ ఉండాలి. కంపెనీ వద్ద నిధుల సమస్య ఉండకూడదు. ఒక కంపెనీ తక్కవ ధరకే ఉత్పత్తి చేసినంత మాత్రాన నాణ్యమైనదిగా భావించడం సరికాదు. కానీ, టెక్నాలజీ పరంగా ఆధునికమైన, పటిష్టమైన కంపెనీ అయితే.. మరో కంపెనీ వచ్చి ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడం అంత తేలిక కాదు.  

మార్కెట్‌ కాదు.. కంపెనీ ముఖ్యం 
విడిగా కంపెనీలను, వాటి వ్యాపార బలాలను చూడాలే కానీ, మార్కెట్‌ గమనాన్ని కాదు. ఎలాంటి స్టాక్‌ అయినా బుల్‌ మార్కెట్లలో పరుగులు పెట్టగలదు. కానీ, బేర్‌ మార్కెట్లో పెరిగే స్టాక్స్‌ కూడా ఉంటాయి. బుల్‌ మార్కెట్లో పతనాన్ని చూసేవీ ఉంటాయి. మార్కెట్లు అనేవి ఎన్నో పరిణామాల ఆధారంగా చలిస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్‌ పెట్టుబడులకు నాణ్యమైన కంపెనీలు, బలమైన వ్యాపారా లు, పటష్టమైన యాజమాన్యాలనే సూత్రాలను అనుసరించాలి. మార్కెట్‌ గమనాన్ని కాదు.

వైవిధ్యం.. 
పెట్టుబడులు అన్నింటిని తీసుకెళ్లి ఒకే చోట పెట్టేయరాదు. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. ఎవరూ నియంత్రించలేరు. అందుకని పెట్టుబడుల పరంగా వైవిధ్యం అవసరం. సరఫరా దారు వైపు సమ్మె ఏర్పడవచ్చు. తుఫాను లేదా భూకంపం.., పోటీ కంపెనీ అసాధారణ స్థాయిలో టెక్నాలజీ పరంగా పై చేయి సాధించొచ్చు. లేదంటే ఓ ఉత్పత్తిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించొచ్చు. ఇలాంటి పరిణామాలు కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టాన్ని తీసుకొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా నడుస్తున్న కంపెనీ సైతం సమస్యల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వివిధ రంగాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. ఆ తర్వాత అంతర్జాతీయం మార్కెట్లలోనూ గొప్ప పెట్టుబడుల అవకాశాలు కనిపిస్తాయి. వాటిని సైతం పరిశీలించొచ్చు. 

తప్పులే పాఠాలు 
పెట్టుబడుల పరంగా తప్పులు చేస్తున్నామని, అసలు ఇన్వెస్ట్‌ చేయకపోవడం అన్నది మరింత పెద్ద తప్పిదం అవుతుంది. తప్పులను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేనే లేదు. నష్టపోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ధోరణితో మరింత రిస్క్‌ తీసుకోవద్దు. ప్రతి తప్పు నుంచి అనుభవాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ముందు చేసిన పెట్టుబడుల్లో నష్టాలకు దారితీసిన అంశాల గురించి తెలుసుకోవాలి. వాటిని తదుపరి పెట్టుబడుల్లో మళ్లీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు కారణాలకు బదులు, నష్టానికి వేరే వాటిని ఆపాదించుకుంటే, మళ్లీ అదే నష్టమే ఎదురవుతుంది. పెట్టుబడుల్లో విజేతలు, పరాజితుల మధ్య తేడా.. తప్పుల నుంచి పాఠాలను తెలుసుకోవడమే.  

మార్కెట్‌ను మించి రాబడులు.. 
మార్కెట్‌ కంటే మెరుగ్గా పెట్టుబడులపై రాబడులు రావాలంటే అందుకు మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా వ్యవహరించాల్సిందే. ఇందుకు మంచి మార్గదర్శకుడిని ఎంపిక చేసుకోవాలి. తగిన పెట్టుబడుల విధానాన్ని రూపొందించుకోవాలి. నిపుణులైన ఫండ్‌ మేనేజర్ల కంటే మెరుగైన పెట్టుబడుల నిర్ణయాలతోనే, గొప్ప ఫలితాలు సాధించడం సాధ్యపడుతుంది. ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అయినా మార్కెట్‌ కంటే అన్ని సమయాల్లోనూ మెరుగైన ఫలితాలను చూపిస్తుందంటే, అది ఇన్వెస్టర్‌ కంటే గొప్పగా పనిచేస్తున్నట్టే. కనుక అవసరమైతే అలాంటి సంస్థల సాయాన్ని తీసుకునేందుకు వెనుకాడొద్దు. 

గుడ్డి విధానం వద్దు 
మీకు మొదటిసారి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ షేరు, లేదంటే మీరు కొనుగోలు చేసిన మొదటి కారు కంపెనీపై అభిమానంతో షేరులో పెట్టుబడులు పెట్టడం సరైనది అనిపించుకోదు. మీరు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినంత మాత్రాన అది పెట్టుబడులకు మంచి కంపెనీ అవ్వాలని లేదు. ఆ షేరు అందుబాటు ధరలోనూ లేకపోవచ్చు. ఇక క్రేజీ ఉన్న ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయడం కూడా సరికాదు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, లిస్టింగ్‌ రోజు లాభానికి విక్రయిద్దామని ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడం అన్నది పెట్టుబడి కాదు, స్పెక్యులేషన్‌ అవుతుంది. కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండి, దీర్ఘకాలం పాటు కంపెనీతో కొనసాగుతానని అనుకున్నప్పుడే ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకరి సలహాపై ఆధారపడి ఇన్వెస్ట్‌ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే చెప్పిన వారి అనుభవం, పరిశీలన, అధ్యయనం మీకు సాయానికి రావు. సొంత అధ్యయనం తర్వాత, తమ పెట్టుబడుల సూత్రాలకు అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. 

ప్రతికూల ధోరణి విడిచి పెట్టాలి 
రిస్క్‌ భయంతో తరచూ ప్రతికూల ధోరణితో మార్కెట్‌ను చూడడం సరికాదు. పెట్టుబడికి ఎంపిక చేసుకునే ముందే ప్రతికూల కోణంలోనూ పరిశోధన చేయడం మంచి చర్య అవుతుంది. ఒక్కసారి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చి, పెట్టుబడి పెట్టిన తర్వాత.. రంధ్రాన్వేషణ ఫలితమివ్వదు. అప్పుడు చిన్న అంశాలు సైతం పెద్దవిగా అనిపిస్తాయి. ప్రతీ పెట్టుబడి రాబడులనే ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. వాస్తవికంగా, సానుకూల ధోరణితో వ్యవహరించడం ద్వారానే దీర్ఘకాలంలో ఈక్విటీల్లో సంపదను సృష్టించుకోగలరు.

మరిన్ని వార్తలు