కీళ్ల వ్యాధి చికిత్స కోసం లీ హెల్త్‌ సరికొత్త ఔషధం

30 Jun, 2021 17:27 IST|Sakshi

హైదరాబాద్: కీళ్ల వ్యాధి(ఆస్టియోఆర్థరైటిస్‌) చికిత్సకు హైదరాబాద్‌కు చెందిన లీ హెల్త్‌ డొమెయిన్‌ సరికొత్త ఔషధాన్ని రూపొందించింది. శక్తివంతమైన ఫైటో పోషకాలతో సహజ బయోన్యూట్రాస్యూటికల్స్‌ ఆధారంగా స్మూత్‌వాక్‌ బ్రాండ్‌ పేరుతో ఈ ట్యాబ్లెట్లను తయారు చేశారు. కొలాజెన్‌ టైప్‌-2, ఎగ్‌ షెల్‌ నుంచి సేకరించిన పొర, గుగ్గిలం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, విటమిన్‌ డి-3 మేళవింపుతో ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. మృదులాస్థిని(కార్టిలేజ్‌) పెంచి కీళ్లలో కణజాల రుగ్మతలపై ఇది చక్కగా పనిచేస్తుంది. తద్వారా నొప్పులు, గట్టిదనాన్ని తగ్గిస్తుంది. ఈ మందు వాడితే సర్జరీలను నివారించవచ్చని కంపెనీ డైరెక్టర్‌ లీలా రాణి వెల్లడించారు.

సాధారణంగా బాధితుల్లో ఎక్కువ మంది మందులు, చికిత్సల కోసం వెళతారు. చివరి ప్రయత్నంగా శస్త్ర చికిత్స(సర్జరీ) చేయించుకుంటున్నారు. ఆస్టియోఆర్థరైటిస్‌ చికిత్సలో వాడే నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్, అనాల్జెసిక్స్‌ నొప్పిని నివారించి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. స్కూత్‌వాక్‌ ట్యాబ్లెట్లు రోజూ 2-3 వేసుకోవడం ద్వారా మూడు వారాల్లో నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఇది సరళత(లూబ్రికేషన్‌), కదలిక మెరుగుపరిచి కీళ్లకు అనువుగా ఉంటుంది. ట్యాబ్లెట్లను మూడు నాలుగు నెలలు వాడడం ద్వారా సర్జరీలను నివారించవచ్చు.

18 ఏళ్లుపైబడ్డ వారందరూ వాడొచ్చు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లలేనివారు ఆన్‌లైన్‌లో అమెజాన్‌ ద్వారా స్మూత్‌వాక్‌ను కొనుగోలు చేయవచ్చు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కీళ్లవాపునకు (ఆర్థరైటిస్‌) సంబంధించి ఆస్టియోఆర్థరైటిస్‌ సాధారణంగా వచ్చే రెండవ అతిపెద్ద జబ్బు. దేశంలో 18 కోట్లకు మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్‌ రోగుల కంటే ఆర్థరైటిస్‌ బాధితులే అధికం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఈ రుగ్మత బారిన పడుతున్నారు. 65 ఏళ్లపైబడ్డ మహిళల్లో 45 శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు బయటపడుతున్నాయి. పరీక్షల్లో వీరిలో 70 శాతం మందికి రుగ్మత నిర్దారణ అవుతోంది.

చదవండి: ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్

మరిన్ని వార్తలు