లెనోవో డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్.. ధర ఎంతో తెలుసా?

24 Feb, 2023 12:41 IST|Sakshi

భారతదేశంలో ఇప్పటివరకు ఒకే స్క్రీన్ కలిగిన ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు స్క్రీన్స్ కలిగిన ల్యాప్‌టాప్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ని 'లెనోవో' కంపెనీ లాంచ్ చేసింది. దీనిని కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గతేడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 లాంచ్ చేసిన లెనోవో ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ హై-ఎండ్ ల్యాప్‌టాప్ ధర రూ. 1,94,990. కంపెనీ లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ 21:10 అల్ట్రా-వైడ్ రేషియోతో 17.3 ఇంచెస్ డిస్‌ప్లే కలిగిన మొదటి ల్యాప్‌టాప్.

థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 8 ఇంచెస్ సెకండరీ టచ్-ఎనేబుల్డ్ డిస్‌ప్లే కూడా పొందుతుంది. ఇది బండిల్ చేయబడిన డిజిటల్ పెన్‌తో లభిస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన టాబ్లెట్ మాదిరిగా కనిపిస్తుంది. డ్యూయెల్ స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ బరువు 2 కేజీలు.

లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ ఐరిస్ గ్రాఫిక్స్ ఆన్‌బోర్డ్‌తో 16జిబి ర్యామ్ కలిగి, 1టిబి ఎస్ఎస్‌డి స్టోరేజీ కెపాసిటీ పొందుతుంది. వీటిని 32జిబి, 2టిబి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

కొత్త లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ యుఎస్‌బి-సి థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్‌బి-సి పోర్ట్, యుఎస్‌బి-ఏ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, 3.5 మిమీ జాక్, వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 11 గంటల వరకు బ్యాటరీ ఉంటుందని లెనోవా పేర్కొంది.

మరిన్ని వార్తలు