6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్‌జీ కంపెనీ

9 Apr, 2021 19:43 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్‌జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి  సహకారం అందించుకోనున్నాయి. 

2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్‌వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్‌జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్‌జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్‌కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. 

మరిన్ని వార్తలు