ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!

23 Aug, 2021 20:29 IST|Sakshi

ఎల్ఐసీ తన పాలసీదారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలను పునరుద్ధరించడానికి రెండు నెలల సమయాన్ని ఇచ్చింది. ఎల్ఐసీ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి చేరువ కావడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీల ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎల్ఐసీ పాలసీ తీసుకోని ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించకపోతే వారి ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయితే కనుక భీమా, ఇతర ప్రయోజనాలు లభించవు. 

అందుకే ఎప్పటికప్పుడు ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించాలని పేర్కొంటుంది. ఒకసారి పాలసీ ల్యాప్స్ అయితే పునరుద్ధరించడం కొంచెం కష్టం అవుతుంది. ఎల్ఐసీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కింద మాత్రమే రుసుము చెల్లించి పాలసీను పునరుద్ధరించుకోవచ్చు. తాజాగా అలాంటి 'స్పెషల్ రివైవల్ క్యాంపైన్' అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 22 వరకు నిర్వహిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా, పాలసీదారులు తమ బీమా పాలసీలను పునరుద్ధరించడానికి ప్రోత్సాహకంగా ఎల్ఐసీ ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ కూడా అందిస్తుంది.(చదవండి: వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!)

ఎవరు అర్హులు
నిర్దిష్ట అర్హత కలిగిన, కొన్ని నియమనిబంధనలకు లోబడి మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలు గడువు పూర్తి కానీ పాలసీదారుల మాత్రమే అర్హులు అని తెలిపింది. అయితే, టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లను దీని నుంచి మినహాయించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర పాలసీల ఆలస్య రుసుము ఫీజులపై రాయితీలు ఇవ్వబడుతున్నాయి" అని ఎల్ఐసీ ఆఫర్ కూడా ఇచ్చింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా రివైవ్ చేసుకోవచ్చు అని తెలిపింది.

ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ ఎంత
ఎల్ఐసీ రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, రూ.1-3 లక్షల మధ్య గల ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రీమియం రూ.3 లక్షలకు మించి ఉన్నట్లయితే ఆలస్య రుసుములో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. "అనివార్య పరిస్థితుల కారణంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. భీమా కవరేజీ పునరుద్ధరించడం కోసం పాత పాలసీని పునరుద్ధరించడం మంచి నిర్ణయం" అని ఎల్ఐసీ తెలిపింది.

మరిన్ని వార్తలు