ఎల్‌ఐసీ క్లెయిమ్స్‌ విషయంలో వారికి కాస్త ఊరట...!

8 May, 2021 15:07 IST|Sakshi

ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) తాజాగా వినియోగదారుల క్లెయిమ్స్‌ ప్రక్రియను సులభతరం చేసింది. సెటిల్మెంట్‌ నిబంధనలను సడలించింది. డెత్‌క్లెయిమ్స్‌కి సంబంధించి పాలసీదారు ఆస్పత్రిలో మరణించిన  పక్షంలో  మున్సిపల్‌ డెత్‌ సర్టిఫికెట్‌ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతరత్రా రుజువులైపా సమర్పించవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.

డెత్‌ సర్టిఫికెట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు, సాయుధ బలగాలు , ఈఎస్‌ఐ, ప్రభుత్వం జారీ చేసే డిశ్చార్జ్‌ సమ్మరీ ఎల్‌ఐసీ క్లాస్‌ 1 అధికారులు లేదా 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల సంతకంతో సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించింది. వీటిపై మరణించిన తేదీ, సమయం స్పష్టంగా ఉండాలి. ఖనన, దహనాలకు సంబంధించిన సర్టిఫికెట్‌ వీటితో పాటు జతపర్చాలని ఒక ప్రకటనలో ఎల్‌ఐసీ తెలిపింది. ఇతరత్రా కేసుల విషయంలో యథాప్రకారంగా మున్సిపల్‌ డెత్‌ సర్టిఫికెట్టే వర్తిస్తుంది. అంతేకాకుండా ఎల్‌ఐసి తన వినియోగదారుల కోసం ఆన్‌లైన్ నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌లను కూడా చేయనుంది. కోవిడ్‌ నేపథ్యంలో  ఆన్‌లైన్‌ పోర్టల్‌ విధానంతో వినియోగదారుల సమస్యలను పరిష్కరించనుంది

కాగా  మే 10 ఎల్ఐసి కార్యాలయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య పనిచేయనున్నాయి.  ప్రతి శనివారం ఎల్ఐసికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి

చదవండి: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ ఇప్పుడే కాదు

మరిన్ని వార్తలు