లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ

28 Jul, 2020 18:36 IST|Sakshi

45 రోజుల్లో 20లక్షలకు పైగా పీసీల విక్రయం

టాప్‌లో లెనోవో

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలయ్యాయి. దీంతో చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం విధానానికి మళ్లారు. అటు పలు కాలేజీలు, విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ విధానాన్నిఎంచుకున్నాయి. ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, టాబెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా మార్కెట్‌ లీటర్‌ లెనోవో ల్యాప్‌లాప్‌లు, నోట్‌బుక్‌లకు భారీగా విక్రయించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలయిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం 45 రోజుల్లోనే దేశంలో 2.9 మిలియన్ పీసీలు అమ్ముడయ్యాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. వీటిలో డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, టాబ్లెట్‌లు వర్క్‌స్టేషన్లు ఉన్నాయని ప్రకటించింది. ఇది నమ్మశక్యం కాని విషమయని కెనాలిస్ రీసెర్చ్ అనలిస్ట్ వరుణ్ కన్నన్ చెప్పారు. ఈ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ల్యాప్‌టాప్‌ల ఎగుమతి 33 శాతం తగ్గిందన్నారు. 8,18,000 పీసీలను విక్రయించిన లెనోవో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. టాబ్లెట్‌ విభాగంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించింది. త్రైమాసికంలో మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటాను  ఈసమయంలో సాధించింది. 629,000 యూనిట్లతో హెచ్‌పీ రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో డెల్ వుంది. డెస్క్‌టాప్‌ల కంటే నోట్‌బుక్‌లకు ప్రాధాన్యత లభించినట్టు కెనాలిస్‌ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, లెనోవా మార్కెట్ వాటా 27.4 శాతం నుంచి 44.2 శాతానికి, హెచ్‌పి మార్కెట్ వాటా 17.3 శాతం నుంచి 23.2 శాతానికి పెరిగింది. డెల్ 10.0 శాతం నుంచి 12.7 శాతం వరకు పెరిగింది. ఎసెర్ మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోగా, శాంసంగ్‌ తన మార్కెట్ వాటా రెట్టింపు చేసుకుంది. గత ఏడాది 2.4 శాతం నుంచి 5.8 శాతానికి పుంజుకుంది.

లాక్‌డౌన్‌  ఆంక్షల కారణంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ లాంటి దిగ్గజ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నారు. కోవిడ్‌-19 సంక్షోభంతో పలుటెక్‌ సంస్థలతో పాటు, చాలా కార్పొరేట్‌ సంస్థలు వర్క్‌ ఫ్రం హోం విధానానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చని, అలాగే  రాబోయే త్రైమాసికాల్లో ఆన్‌లైన్ లెర్నింగ్‌కే ఎక్కువ మొగ్గుచూపే అవకాశ ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తు‍న్నాయి. గత కొన్నేళ్లుగా బాగా క్షీణించిన పీసీ పరిశ్రమకు ఈ బూస్ట్‌ సరిపోదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు