లోధా డెవలపర్స్‌ ఐపీవోకు రెడీ

18 Feb, 2021 17:55 IST|Sakshi

మూడోసారి సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

10 శాతం వాటా విక్రయ యోచన

రూ. 2,500 కోట్ల సమీకరణ లక్ష్యం

ముంబై, పుణే, లండన్‌లో కార్యకలాపాలు

న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ లోధా డెవలపర్స్‌ మరోసారి పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ముంబై కేంద్రంగా రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ గతంలో రెండుసార్లు పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు చేసింది. దీంతో తాజాగా మాక్రోటెక్‌ డెవలపర్స్‌ పేరుతో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరింది. కంపెనీ తొలిసారి 2009 సెప్టెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,800 కోట్లను సమీకరించాలని భావించింది.

2010 జనవరికల్లా సెబీ అనుమతించినప్పటికీ ప్రపంచస్థాయిలో చెలరేగిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఐపీవో ప్రణాళికలకు మంగళం పాడింది. తదుపరి 2018 ఏప్రిల్‌లో మళ్లీ ఐపీవోను చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఈసారి రూ. 5,500 కోట్ల సమీకరణకు అనుమతి కోరింది. 2018 జులైకల్లా సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను సాధించింది. అయితే స్టాక్‌ మార్కెట్లలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలను ఉపసంహరించుకుంది.  

1995లో... 
ప్రయివేట్‌ రంగ సంస్థ లోధా గ్రూప్‌ను 1995లో మంగళ్‌ ప్రభాత్‌ లోధా ఏర్పాటు చేశారు. దేశీయంగా రియల్టీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించింది. ముంబై, పుణేలతోపాటు లండన్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. సేల్స్‌ బుకింగ్స్‌రీత్యా రెసిడెన్షియల్‌ విభాగంలో దేశీయంగా అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 10 శాతం వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్లను రుణ చెల్లింపులకు, రూ. 375 కోట్లను ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌ కింద రూ. 500 కోట్లు సమీకరించే వీలున్నట్లు పేర్కొంది.  

చదవండి:
అమెజాన్‌ ఇండియా భారీ మోసం

గృహ రుణ సంస్థలకు ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు

మరిన్ని వార్తలు