వొడాఫోన్‌ ఐడియాకు తగ్గిన నష్టాలు

11 May, 2022 11:11 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది (2021–22) చివరి క్వార్టర్‌లో టెలికం  సంస్థ వొడాఫోన్‌ ఐడియా   నికర నష్టం తగ్గి రూ. 6,563 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 7,023 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 7% పుంజుకుని రూ. 10,239 కోట్లను అధిగమించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వొడాఫోన్‌ ఐడియా నష్టాలు భారీగా తగ్గి రూ. 28,245 కోట్లకు పరిమితమయ్యాయి. 2020–21లో రూ. 44,233 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.

2021 నవంబర్‌ 5నుంచి టారిఫ్‌ల పెంపును చేపట్టడంతో త్రైమాసికవారీగా ఆదాయం 5.4 శాతం బలపడినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 7.5% వృద్ధితో రూ. 124ను తాకినట్లు వెల్లడించింది. క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో రూ. 115 ఏఆర్‌పీయూ సాధించింది. అయితే ఇదే సమయంలో వినియోగదారుల సంఖ్య 24.72 కోట్ల నుంచి 24.38 కోట్లకు తగ్గింది. మార్చికల్లా వడ్డీతో కలిపి గ్రూప్‌ రుణ భారం రూ. 1,97,878 కోట్లను తాకింది.  
చదవండి: నోకియా పోరాటం.. అదరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌..

మరిన్ని వార్తలు