ఎల్‌అండ్‌టీ డౌన్‌- ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ అప్

29 Oct, 2020 14:34 IST|Sakshi

షేరుకి రూ. 18 ప్రత్యేక డివిడెండ్‌

క్యూ2(జులై- ఆగస్ట్‌) ఫలితాల నిరాశ

5 శాతం పతనమైన ఎల్‌అండ్‌టీ షేరు 

క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు

8 శాతం జంప్‌చేసిన ఒరియంట్‌ ఎలక్ట్రిక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. అయితే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో హోమ్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. గత 8 రోజులుగా బలపడుతూ రావడంతో ఎల్‌అండ్‌టీ కౌంటర్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని.. దీంతో ఈ షేరు బలహీనపడిందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ కౌంటర్‌ లాభాలతో ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం..

ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఎల్‌అండ్‌టీ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 1,410 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం నీరసించి రూ. 31,035 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం రూ. 28,039 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇవి వార్షిక ప్రాతిపదికన 42 శాతం తక్కువకాగా.. క్యూ1తో పోల్చితే 19 శాతం అధికమని వివరించింది. ఈ కాలంలో ఎలక్ట్రికల్‌ ఆటోమేషన్‌ బిజినెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్‌ 5 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.4 శాతం పతనమై రూ. 930 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 926కు నీరసించింది. 

ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 32 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 434 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.6 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం జంప్‌చేసి రూ. 221 సమీపానికి చేరింది. 

మరిన్ని వార్తలు