Ludo King Game: భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు

3 Mar, 2022 18:25 IST|Sakshi

భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్‌ ప్లే యాప్‌ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్‌ ప్లే పార్ట్‌నర్‌షిప్స్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ పూర్ణిమా కొచికర్‌ తెలిపారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్‌ హబ్‌తో కలిసి గూగుల్‌ .. యాప్‌స్కేల్‌ అకాడమీ క్లాస్‌ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్‌ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు.  

యాప్‌స్కేల్‌ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. 

చదవండి: ఐఫోన్‌ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!!

మరిన్ని వార్తలు