Ethos IPO: ఐపీవోకు లగ్జరీ వాచీల కంపెనీ!

12 May, 2022 21:34 IST|Sakshi

 లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్‌ కంపెనీ ఇథోస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 836–878 ధరల శ్రేణి ప్రకటించింది. 20న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. 

వీటికి జతగా కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 11 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2020–21లో కంపెనీ రూ. 386 కోట్లకుపైగా ఆదాయం సాధించగా, దాదాపు రూ. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ దేశీయంగా ప్రీమియం, లగ్జరీ వాచీల భారీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. జాబితాలో ఒమెగా, ఐడబ్ల్యూసీ స్కఫాసెన్, లాంగిన్స్, టిస్సట్, రేమండ్‌ వీల్, లూయిస్‌ మొయినెట్‌ తదితరాలున్నాయి.

ప్రిస్టీన్‌ లాజిస్టిక్స్‌ ఐపీవో బాట 
లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీసుల కంపెనీ ప్రిస్టీన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 

మరిన్ని వార్తలు