కోల్గేట్‌ పేస్ట్‌ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే..

1 Jan, 2022 10:28 IST|Sakshi

Colgate Products Shortage In Maharastra: కోల్గేట్‌ పేస్ట్‌, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్‌ పేస్టులు హాట్‌ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్‌ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్‌ నడుస్తోంది.    


అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్‌ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని  డిస్ట్రిబ్యూటర్స్‌(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి  మ్యాక్స్‌ఫ్రెష్‌ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్‌ టూత్‌ బ్రష్స్‌లు పంపిణీ  ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు.

 

కారణం.. 
ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్‌ అంటే జియోమార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, ఉడాన్‌, ఎలాస్టిక్‌ రన్‌ లాంటి కామర్స్‌ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్‌ మార్జిన్‌ 8-12 శాతం ఉండగా, ఆన్‌లైన్‌ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్‌) ఛానెల్ నుంచి స్టాక్‌లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు.

కోల్గేట్‌ స్పందన.. 

కోల్గేట్‌ పాల్మోలైవ్‌ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.  ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్‌ లివర్‌ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.  అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది.

లేఖలు రాసినా.. 
ఆల్‌ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు)..  ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్‌ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది).  లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్‌, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం.
 

చదవండి: లేస్‌ చిప్స్‌ ‘ఆలు’పై పేటెంట్‌ రైట్స్‌ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట

మరిన్ని వార్తలు