గడిచిన ఆరు నెలలుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక్కో కంపెనీ ధరలు పెంచుతూ పోతుంది. తాజాగా ఈ జాబితాలో మహీంద్రా గ్రూపు చేరింది. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరిగాయంటూ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. సగటున 2.5 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
మహీంద్రా గ్రూపు నుంచి థార్, ఎక్స్యూవీ సిరీస్, బొలేరో వంటి వెహికల్స్కి మార్కెట్లో మంచి వాటా ఉంది. తాజాగా పెంపుతో వివిధ మోడళ్లు, వేరియంట్లను బట్టి కనిష్టంగా రూ.10,000ల నుంచి గరిష్టంగా రూ.63,000ల వరకు కొనుగోలుదారులపై భారం పడనుంది.
కార్ల తయారీలో ఉపయోగించే స్టీల్, పల్లాడియం, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధర పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ మహీంద్రా గ్రూపు వివరణ ఇచ్చింది. ధరల పెంపుకు రెండు రోజుల ముందు మహీంద్రా పోర్ట్ఫోలియోలో పెద్దగా డిమాండ్ లేని కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత రన్నింగ్ మోడళ్లపై ధరను పెంచింది.