ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి అడ్డాగా తెలంగాణ.. 1000 కోట్లతో మహీంద్రా EV ప్లాంట్

16 Feb, 2023 11:32 IST|Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతదేశంలో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణాలో రూ. 1000 కోట్లతో ఒక ఈవీ ప్లాంట్ ఏర్పాటుకి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది.

ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణా అడ్డాగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ సందర్భంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 'రాజేశ్‌ జేజురికర్‌' మాట్లాడుతూ, తెలంగాణాలో ఏర్పాటు కానున్న ఈవీ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా ఉత్పత్తవుతాయి. తాజా పెట్టుబడులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ తయారీకి పెద్ద పీట వేయనున్నారు, ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా తయారవుతాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకున్న డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దీనివైపు అడుగులువేస్తున్నాయి. మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేయనున్న కొత్త ఈవీ ప్లాంట్ మరో 3-5 సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు