మహీంద్రాకు కూడా తప్పని పాట్లు..!

11 Dec, 2021 21:32 IST|Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా నవంబర్-2021లో ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.  ఈ ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌ నెలలో 5.3 శాతం మేర ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ ఒక​ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2020లో ఉత్పత్తి చేసిన ఎస్‌యూవీ 18119 వాహనాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 0.7 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2021లో ఉత్పత్తి చేసిన ఎస్‌యూవీల సంఖ్య 19,286 గా ఉండగా గత నెలలో 18,261 ఎస్‌యూవీలను మాత్రమే ఉత్పత్తి చేసింది. 

సెమీ కండక్టర్స్‌ కొరతతో..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్‌ కొరత మహీంద్రాను కూడా తాకింది. సెమీకండక్టర్స్‌ కొరత అధింకగా ఉండటంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 32,000 యూనిట్ల ఉత్పత్తి నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ప్రకటించింది. 

త్రీవీలర్‌, లైట్‌ వేట్‌ వాణిజ్య వాహనాల విషయానికొస్తే...కంపెనీ గత నెలలో 420 యూనిట్లను తయారు చేసింది, 2020లో ఇదే నెలలో 4,046 యూనిట్లతో పోలిస్తే గణనీయంగా 89.6 శాతం రెండంకెల తగ్గుదల నమోదు చేసింది.

అమ్మకాల విషయానికొస్తే...నవంబర్ 2021లో  మహీంద్రా మొత్తం ఆటో అమ్మకాలు (ప్యాసింజర్ వాహనాలు+ వాణిజ్య వాహనాలు+ ఎగుమతులు) గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 42,731 వాహనాలతో పోలిస్తే 40,102 యూనిట్లుగా ఉన్నాయి, 2020తో పోల్చుకుంటే 6.15 శాతం క్షీణతను నమోదు చేసింది.
చదవండి: వాహన విక్రయాలకు చిప్‌ సెగ

మరిన్ని వార్తలు