సాక్షి,ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా ఎక్స్యూవీ 400 భారత మార్కెట్లోకి వచ్చేసింది. మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎక్స్యూవీగా చెబుతున్న ఈ కారును గత ఏడాది సెప్టెంబర్ (2022)లో అధికారికంగా లాంచ్ చేయగా ధరలను మాత్రం తాజాగా ప్రకటించింది.
ధరలు
మహీంద్రా ఎక్స్యూవీ 400 ధరలు రూ. 15.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఒక వేరియంట్ ధర 16.49 లక్షలు. టాప్ లైన్ XUV400 EL వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు. అయితే ఇవి ప్రారంభ ఆఫర్ ధరలనీ, మొదటి 5,000 బుకింగ్లకు మాత్రమే ఈ రేట్లు చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ కంపెనీ డీలర్షిప్లలోకి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ జనవరి 26న ప్రారంభం. ఎక్స్యువీ 400 ఈఎల్ డెలివరీలు మార్చి 2023 నుంచి ప్రారంభమైతే, దీపావళి సీజన్లో ఎక్స్యువీ 400 ఈసీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మొదటి దశలో 34 నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
మహీంద్రా ఎలక్ట్రిక్ఎస్యువీ ప్రయాణంలో మరుపురాని క్షణం ఎక్స్యువీ 400 ఆవిష్కరణ అని మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజె నక్రా తెలిపారు. అత్యున్నత పనితీరు, డిజైన్, స్పేస్,టెక్నాలజీని ఆకర్షణీయమైన ధరలో ఎక్స్యువీ 400 అందిస్తుందన్నారు.
మహీంద్రా కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV EC, EL అనే రెండు వేరియంట్లలో లభ్యం. EC వేరియంట్లోని 34.5 kWh లిథియం ఇయాన్బ్యాటరీ , 375 కిమీ పరిధిని, EL వేరియంట్ 39.4 kWh బ్యాటరీ ప్యాక్ను 456 కిమీ పరిధిని అందిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే యొక్క ఐదు రంగుల్లో లభ్యం. అయితే EL వేరియంట్లో ఎగువన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో అందిస్తోంది.