ఆన్‌లైన్‌ 'అతి'.. అంతా కరోనా వల్లే! అవసరానికి మించి ఎంత టైం గడుపుతున్నారంటే..

26 Aug, 2021 08:08 IST|Sakshi

న్యూఢిల్టీ: కరోనా మహమ్మారి..నిత్య జీవనంలో డిజిటల్‌ను భాగం చేయడమే కాకుండా.. మరింత మంది ఆన్‌లైన్‌కు బానిసలుగా మారేలా కారణమవుతున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్టన్‌లైఫ్‌ లాక్‌ ఓ నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా ఎక్కువ సమయం ఇంటివద్దే ఉండాల్సి రావడంతో ప్రజల ఆన్‌లైన్‌ ధోరణిపై ఈ సంస్థ అంతర్జాతీయంగా అధ్యయనం నిర్వహించింది. భారత్‌కు సంబంధించి ఫలితాలను గమనిస్తే.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు (సర్వేలో పాల్గొన్న వారిలో) కరోనా వల్లే తాము ఆన్‌లైన్‌కు బానిసలుగా మారినట్టు చెప్పారు. 

ఆసక్తికర అంశాలు..
• విద్యా, కార్యాలయ పని కాకుండా ఫోన్లు, సిస్టమ్స్‌పై (ఆన్‌లైన్‌) తాము వెచ్చించే అదనపు సమయం గణనీయంగా పెరిగినట్టు ప్రతీ 10 మందిలో 8 మంది పేర్కొన్నారు.  

• చదువు, ఆఫీసు పని కాకుండా సగటున ఒక్కొకరు 4.4 గంటలను ఆన్‌లైన్‌పై గడిపేస్తున్నట్టు ఈ సంస్థ నివేదిక తెలియజేసింది.  

• తాము మరింత సమయం స్మార్ట్‌ఫోన్‌పైనే గడిపేస్తున్నామని 84 శాతం మంది తెలిపారు.  

• ఇలా అన్‌లైన్‌పై ఎక్కువ సమయం గడపడం తమ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నట్టు 74 శాతం మంది అంగీకరించారు.  

• మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందని 55 శాతం మంది పేర్కొన్నారు.  

• స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఫోన్లు, సిస్టమ్స్‌పై గడిపే సమయాన్ని పరిమితం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని 76 శాతం మంది చెప్పారు. 

సమతూకం అవసరం
ఆఫ్‌లైన్‌లో చేసుకోవాల్సిన పనులను కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి పరిస్థితులు కల్పించాయన్నది సుస్పష్టం. అయితే స్క్రీన్లపై గడిపే సమయం, ఇతర పనులకు వెచ్చించే సమయం మధ్య ఆరోగ్యకరమైన సమతూకం అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించడం ముఖ్యం. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినకూడదు’’     

– రితేష్‌చోప్రా, నార్టన్‌లైఫ్‌లాక్‌ డైరెక్టర్‌ (సేల్స్‌)   

చదవండి : మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు మూడు రెట్లు

>
మరిన్ని వార్తలు