మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌- ఐటీ, బ్యాంక్స్ భేష్‌

20 Nov, 2020 16:00 IST|Sakshi

282 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌‌- 43,882కు చేరిక

87 పాయింట్లు పెరిగి 12,859 వద్ద ముగిసిన నిఫ్టీ

ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ ప్లస్- మీడియా, ఫార్మా వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం అప్

ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. అయితే పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లు బలపడి 12,859 వద్ద నిలిచింది. సహాయక ప్యాకేజీపై అంచనాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,013 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,454 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,892- 12,730 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. అయితే మీడియా 0.9 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 9.3 శాతం దూసుకెళ్లగా.. టైటన్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, గ్రాసిమ్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ 5.4-2.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆర్‌ఐఎల్ 3.7 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఇన్‌ఫ్రాటెల్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో  ఇన్‌ఫ్రాటెల్‌ 20 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, బీఈఎల్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌‌, జూబిలెంట్‌ ఫుడ్‌, నౌకరీ, సెయిల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎంఆర్ఎఫ్‌ 7.5-3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్‌,  అశోక్ లేలాండ్‌, ఎన్‌ఎండీసీ, భారత్‌ ఫోర్జ్‌, డీఎల్‌ఎఫ్‌, టాటా పవర్‌, ఐబీ హౌసింగ్‌ 5-1.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,548 లాభపడగా.. 1240 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు