ముంబై: గత కొన్ని రోజులుగా దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7న ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలు అస్థిరత మధ్య స్వల్పంగా నష్ట పోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు అదే తీరును కొనసాగించాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో దూసుకెళ్లిన సూచీలు చివరకు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్పంగా నష్ట పోయాయి. ఇక ముగింపులో, సెన్సెక్స్ 17.43 పాయింట్లు (0.03%) క్షీణించి 58279.48 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 15.70 పాయింట్లు లేదా 0.09% నష్టపోయి 17362.10 వద్ద ముగిసింది. నేడు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.42 వద్ద ఉంది.(చదవండి: వొడాఫోన్ ఐడియాకు సర్కారు మద్దతు కీలకం)
బీపీసీఎల్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, విప్రో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు డీల పడితే.. భారతి ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇండస్ సిండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో దూసుకెళ్లయి. ఎఫ్ఎంసీజీ మినహా ఇతర అన్ని చమురు, గ్యాస్, ఐటీ రియాల్టీ రంగాల సూచీలు 1-2 శాతం తగ్గడంతో మార్కెట్లు నష్టపోయాయి.