బ్యాంక్స్‌ వీక్‌- మెటల్‌, రియల్టీ జోరు

2 Dec, 2020 15:50 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

37 పాయింట్లు తగ్గి 44,618కు చేరిన సెన్సెక్స్‌ 

5 పాయింట్లు బలపడి 13,114 వద్ద నిలిచిన నిఫ్టీ

మెటల్‌, రియల్టీ, ఆటో, ఐటీ అప్‌- ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ డౌన్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

ముంబై, సాక్షి: జీడీపీ జోష్‌తో ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 13,114 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,170 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,129-12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

గెయిల్‌ లాభాల్లో
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మెటల్‌, ఆటో, ఐటీ రంగాలు 3-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5-1.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, టైటన్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా స్టీల్‌, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5-2.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, ఐసీఐసీఐ, నెస్లే, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బ్రిటానియా, ఎస్‌బీఐ 3.4-0.6 శాతం మధ్య నష్టపోయాయి. 

అదానీ అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌, టాటా కెమ్‌, నాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌ఎండీసీ, పిడిలైట్‌, ఎస్కార్ట్స్‌, డీఎల్‌ఎఫ్‌ 7.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్‌, సన్‌ టీవీ, టీవీఎస్‌ మోటార్‌, మదర్‌సన్‌, అపోలో హాస్పిటల్స్‌, యూబీఎల్‌, ఎంజీఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,728 లాభపడగా.. 1,196 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

>
మరిన్ని వార్తలు