86 పాయింట్లు జమ- 38,615కు సెన్సెక్స్
23 పాయింట్ల లాభంతో 11,408 వద్ద నిలిచిన నిఫ్టీ
మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ.. జోరు
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1.2% ప్లస్
చివరి అర్ధగంటలో అమ్మకాలు తలెత్తడంతో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు జమ చేసుకుని 38,615 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,408 వద్ద నిలిచింది. అయితే ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దేశీయంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా మూడో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తొలుత సెన్సెక్స్ 38,788ను అధిగమించింది. తదుపరి 38,551కు వెనకడుగు వేసింది. ఇదేవిధంగా నిఫ్టీ ఇంట్రాడేలో 11,460 వద్ద గరిష్టాన్ని తాకగా 11,394 వద్ద కనిష్టాన్నీ చేరింది. మంగళవారం యూఎస్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఎంసీజీ, ఫార్మా వీక్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా 5.4 శాతం జంప్చేయగా.. పీఎస్యూ బ్యాంక్స్ 2.4 శాతం ఎగశాయి. రియల్టీ 1.25 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ 0.4 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 14 శాతం దూసుకెళ్లగా.. గెయిల్, టెక్మహీంద్రా, ఎయిర్టెల్, మారుతీ, ఐసీఐసీఐ, యూపీఎల్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆర్ఐఎల్ 5-1 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్లో బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, నెస్లే, కొటక్ బ్యాంక్, బ్రిటానియా, కోల్ ఇండియా, హెచ్యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్, ఐషర్, సిప్లా, బజాజ్ ఫిన్ 1.2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
అదానీ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 14 శాతం దూసుకెళ్లగా.. నాల్కో, పీవీఆర్, టాటా కెమ్, సెంచురీ టెక్స్, పీఎన్బీ, పీఎఫ్సీ, ఈక్విటాస్, ఎల్ఐసీ హౌసింగ్, కెనరా బ్యాంక్, ఆర్ఈసీ 7-3.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క అమరరాజా, చోళమండలం, భారత్ ఫోర్జ్, ఐడియా, సీమెన్స్, ఎక్సైడ్, బాష్, ఐబీ హౌసింగ్, పెట్రోనెట్ 4-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1790 లాభపడగా.. 1000 నష్టాలతో నిలిచాయి.
ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1135 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 379 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 718 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.