మార్కెట్లు ప్లస్‌‌- విదేశీ ఇన్వెస్టర్ల దన్ను

4 Dec, 2020 09:41 IST|Sakshi

172 పాయింట్లు అప్‌- 44,805కు సెన్సెక్స్‌

59 పాయింట్లు ఎగసి 13,193 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం అప్

ముంబై, సాక్షి: ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ స్పీడందుకోనుందన్న అంచనాలతో మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 172 పాయింట్లు ఎగసి 44,805కు చేరగా.. నిఫ్టీ 59 పాయింట్లు జమ చేసుకుని 13,193 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,845వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం గరిష్టంగా 13,204ను తాకింది. గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో నిరవధికంగా ఇన్వెస్ట్‌ చేస్తుండటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. 

మీడియా‌ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి.  మీడియా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్‌ 1.2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్‌, గెయిల్‌, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, హిందాల్కో, యూపీఎల్‌, హీరో మోటో 3.5-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్, ఎస్‌బీఐ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.2-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి.

టాటా.. పవర్‌
డెరివేటివ్స్‌లో టాటా పవర్‌ 5.6 శాతం జంప్‌చేయగా.. పెట్రోనెట్‌, ఎస్కార్ట్స్‌, ఇండిగో, యూబీఎల్‌, టాటా కన్జూమర్‌, అపోలో టైర్‌ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు బీవోబీ, క్యాడిలా హెల్త్‌కేర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పిరమల్‌, ఐడియా, ఆర్‌ఈసీ, కోఫోర్జ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ 1.3-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,420 లాభపడగా.. 444 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు