137 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్- 38,507కు
నిఫ్టీ 45 పాయింట్లు ప్లస్- 11,353 వద్ద ట్రేడింగ్
ఎన్ఎస్ఈలో ఐటీ, మీడియా, మెటల్, బ్యాంకింగ్ అప్
బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం లాభాల్లో
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరికొంత బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 38,507కు చేరింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,353 వద్ద ట్రేడవుతోంది. టెక్నాలజీ దిగ్గజాల అండతో బుధవారం యూఎస్ మార్కెట్లు 1-2 శాతం మధ్య లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
మెటల్, ఐటీ అప్
ఎన్ఎస్ఈలో మెటల్, ఐటీ, మీడియా రంగాలు 1.5 శాతం లాభపడగా.. బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం పుంజుకున్నాయి. ఆటో 0.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, యూపీఎల్, ఎన్టీపీసీ, టీసీఎస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, గెయిల్ 4-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎయిర్టెల్, ఐటీసీ, సిప్లా, టాటా మోటార్స్, ఐషర్, సన్ ఫార్మా 2-0.5 శాతం మధ్య డీలా పడ్డాయి.
ఇండిగో జూమ్
డెరివేటివ్స్లో ఇండిగో 7 శాతం జంప్చేయగా.. అపోలో హాస్పిటల్స్, పీవీఆర్, గోద్రెజ్ సీపీ, టాటా కన్జూమర్, కంకార్, పెట్రోనెట్, నౌకరీ, ఎంజీఎల్, అదానీ ఎంటర్ 3-2 శాతం మధ్య వృద్ధి చూపాయి. కాగా.. మరోవైపు అరబిందో 3 శాతం పతనంకాగా.. లుపిన్, బాష్, గ్లెన్మార్క్, మదర్సన్ 1 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1277 లాభపడగా.. 534 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.