193 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్- 38,214కు
నిఫ్టీ 55 పాయింట్లు డీలా- 11,267 వద్ద ట్రేడింగ్
పీఎస్యూ బ్యాంక్స్ 3.2% అప్- ఫార్మా, మెటల్ వీక్
బలహీన ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 193 పాయింట్లు క్షీణించి 38,214కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్ల వెనకడుగుతో 11,267 వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వ ప్యాకేజీకి డెమక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో దేశీయంగానూ కొంతమేర సెంటిమెంటు నీరసించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ప్రయివేట్ బ్యాంక్స్ వీక్
ఎన్ఎస్ఈలో ఫార్మా, మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ 1.7-0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 3.2 శాతం జంప్చేయగా.. ఆటో, మీడియా 1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎల్అండ్టీ, విప్రో, బజాజ్ ఫిన్, గెయిల్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.3-1.2 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్లో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఎంఅండ్ఎం, ఐషర్, జీ, మారుతీ, ఎయిర్టెల్ 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి.
పీఎన్బీ అప్
డెరివేటివ్స్లో పీఎన్బీ, బీవోబీ, పీవీఆర్, కెనరా బ్యాంక్, బీఈఎల్, మదర్సన్, భెల్, ఈక్విటాస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5.5-1.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. ముత్తూట్, మణప్పురం, దివీస్, లుపిన్, నౌకరీ, కేడిలా, గ్లెన్మార్క్, బయోకాన్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 918 నష్టపోగా.. 931 లాభాలతో కదులుతున్నాయి.