రికార్డులే హద్దుగా మార్కెట్ల దూకుడు

29 Dec, 2020 10:03 IST|Sakshi

322 పాయింట్ల హైజంప్‌‌‌- 47,676కు సెన్సెక్స్‌

88 పాయింట్లు ఎగసి 13,961కు చేరిన నిఫ్టీ

20 సెషన్లలో 14సార్లు సరికొత్త గరిష్టాలకు

మెటల్‌ మినహ అన్ని రంగాలూ లాభాల్లోనే‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 322 పాయింట్లు జంప్‌చేసి 47,676కు చేరగా.. నిఫ్టీ 88 పాయింట్లు ఎగసి 13,961 వద్ద ట్రేడవుతోంది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్‌ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు.  (19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్‌)

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, గ్రాసిమ్‌, యాక్సిస్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా 4-1.2  శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, నెస్లే, హిందాల్కో, అల్ట్రాటెక్‌, ఐషర్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఆర్‌బీఎల్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, బంధన్‌ బ్యాంక్‌, టాటా కెమ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బీవోబీ 4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, టొరంట్‌ ఫార్మా, బాటా, ఐబీ హౌసింగ్‌, ఎస్కార్ట్స్‌, కాల్గేట్‌ పామోలివ్‌, నాల్కో, క్యాడిలా 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,558 లాభపడగా.. 673 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు