మూడో రోజూ ర్యాలీ బాట.. బ్యాంక్స్‌ జోరు

24 Dec, 2020 09:35 IST|Sakshi

309 పాయింట్లు అప్‌‌‌- 46,753కు సెన్సెక్స్‌

90 పాయింట్లు పెరిగి 13,691 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌, ఆటో లాభాల్లో‌- ఐటీ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 309 పాయింట్లు జంప్‌చేసి 46,753కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 13,691 వద్ద ట్రేడవుతోంది. నిరుద్యోగ క్లెయిములు తగ్గడం, సహాయక ప్యాకేజీకి ఒప్పందం నేపథ్యంలో బుధవారం యూఎస్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మిశ్రమంగా ముగిశాయి. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 46,780- 46,615 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 13,702-13,644 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. 

ఐటీ మినహా 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఐటీ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, గెయిల్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 4-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఇన్ఫోసిస్‌, విప్రో అదికూడా 1-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి.

వేదాంతా జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో వేదాంతా, అంబుజా, ఏసీసీ, ఎన్‌ఎండీసీ, సెయిల్‌, ఐసీఐసీఐ ప్రు, రామ్‌కో సిమెంట్‌, పీఎన్‌బీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండస్‌ టవర్‌, ఆర్‌ఈసీ 6.4-2  శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, భారత్‌ ఫోర్జ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, మైండ్‌ట్రీ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,544 లాభపడగా.. 300 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు