142 పాయింట్లు డౌన్- 40,565కు సెన్సెక్స్
57 పాయింట్లు క్షీణించి 11,880 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ
ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ నష్టాల్లో
బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.15 శాతం అప్
కోవిడ్-19 ప్యాకేజీపై సందేహాలతో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 142 పాయింట్లు క్షీణించి 40,565కు చేరగా.. నిఫ్టీ 57 పాయింట్ల వెనకడుగుతో 11,880 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,414 పాయింట్ల దిగువన, నిఫ్టీ 11,854 పాయింట్ల దిగువన కనిష్టాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో ఇటీవల నమోదైన ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు తెలియజేశారు.
మీడియా ప్లస్లో
ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. మీడియా 0.6 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్, ఐషర్, టాటా మోటార్స్, నెస్లే, హిందాల్కో, ఎంఅండ్ఎం 2.3-1 శాతం మధ్య నష్టపోయాయి. అయితే బజాజ్ ఫిన్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, విప్రో 2.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.
వేదాంతా అప్
ఎఫ్అండ్వో కౌంటర్లలో వేదాంతా, పెట్రోనెట్, మైండ్ట్రీ, జీ, ఎల్ఐసీ హౌసింగ్, మ్యాక్స్ ఫైనాన్స్, వోల్టాస్, సన్ టీవీ, సెయిల్, బీఎఈల్ 2.5-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. కాగా.. మరోపక్క అరబిందో, బంధన్ బ్యాంక్, మదర్సన్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ సీపీ, ఫెడరల్ బ్యాంక్, పీవీఆర్, డాబర్ 2.2-1.5 శాతం మధ్య బోర్లా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 828 లాభపడగా.. 788 నష్టాలతో ట్రేడవుతున్నాయి.