అదానీలో ఎల్‌ఐసీ పెట్టుబడులు లాభాల్లోకి

4 Mar, 2023 04:31 IST|Sakshi

రూ. 8,900 కోట్లకుపైగా ప్లస్‌

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ మెరుగుపడింది. తాజాగా (శుక్రవారం ధరలతో చూస్తే) రూ. 8,900 కోట్లకుపైగా విలువకు జమ అయ్యింది. గ్రూప్‌ లో 10 లిస్టెడ్‌ కంపెనీలుండగా.. 7 కంపెనీలలో ఎల్‌ఐసీ గతంలో ఇన్వెస్ట్‌ చేసింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీలో కనిష్టంగా 1.28 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో గరిష్టంగా 9.14 శాతం వాటాలు సొంతం చేసుకుంది. వీటి కొనుగోలు ధరల ప్రకారం ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ. 30,127 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 24కల్లా వీటి విలువ రూ. 29,893 కోట్లకు క్షీణించింది. అయితే తాజాగా ఈ విలువ రూ. 39,068 కోట్లను దాటింది.

వెరసి అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ. 8,941 కోట్లమేర లాభపడినట్లయ్యింది. కాగా.. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీలలో కొద్ది రోజులుగా అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు నష్టాలతో డీలా పడ్డాయి. అయితే రెండు రోజులుగా తిరిగి అదానీ గ్రూప్‌ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో లాభాల బాటలో సాగుతున్నాయి. ఫలి తంగా ఎల్‌ఐసీ పెట్టుబడులు సైతం బలపడ్డా యి. అదానీ గ్రూప్‌ ఈక్విటీ, రుణ సెక్యూరిటీల లో 2022 డిసెంబర్‌31కల్లా మొత్తం రూ. 35, 917 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు జనవరి 30న ఎల్‌ఐసీ వెల్లడించింది. ఆపై 2023 జనవరి 27కల్లా వీటి మొత్తం విలువ రూ. 56,142 కోట్లను తాకడం గమనార్హం!  

మరిన్ని వార్తలు